కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు పని చెప్పాయి. పాలక. ప్రతిపక్షంలో మాటల తూటాలకు తెరతీశాయి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి( టిఅర్ ఎస్ ) ఇంకా ఎవరూ స్వపక్షం పై విమర్శలు బహిరంగంగా చేసేందుకు సాహసించ లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ లో మాత్రం అసమ్మతి స్వరం ఇప్పటికే మ్రోగింది. ఉప ఎన్నిక గెలుపు ను తన ఖాతా లో వేసుకున్న భారతీయ జనతా పార్టీలోనూ అంతర్గత విభేధాలు చాపక్రింద నీరులా సాగుతున్నాయి. విజయం వరించినా, అది సోంత గెలుపు కాదని, లోపాయి కారీ ఒప్పందం తోనే గెలిచామని బిజేపి నేతలు సణుక్కుంటున్నారు.
హుజూరా బాద్ ఎన్నికల ఫలితాల తరువాత కొత్త కొత్త పొత్తులు వెలుగు చూశాయి. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతవడం తో ఈ విషయం బహిర్గతమైంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న నానుడిని ఈ ఎన్నికల తేటతెల్లం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఎవరు అనే విషం అందరికీ తెలిసిందే. దాదాపు 133 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ భారత్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన ఘనత ఆ పార్టీ సోంతం. అలాంటి చరిత్ర గల పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. రానున్న ఎన్నికల్లో అధికారంలో కి వస్తామని కలలు కంటున్న ఆ పార్టీ శ్రేణులకి ఈ ఉప ఎన్నికల ఫలితాలు శరాఘాతమయ్యాయి.
హుజూరా బాద్ లో కనీసం డిపాజిట్ ఓట్లు అంటే 12 వేల ఓట్లు కాంగ్రెస్ కు పడాలి. కానీ అది జరగ లేదు. కేవలం 3112 మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2014 కు ముందు నుంచి మెరుగు పడింది. ఆ పార్టీకి 2014 ఎన్నికల్లో 38 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2018 నాటికి కాంగ్రెస్ మరింత పుంజుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్ కు 61 వేలకు పైగా ఓట్లు వచ్చి పడ్డాయి. కానీ 2021 ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత పుంజుకుందని అందరూ భావించారు. పంచ్ డైలాగులతో జనాల్లో ఉత్తేజం నింపే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభలకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. కానీ క్షేత్ర స్థాయిలో అవి ఓటుగా మారలేదు. కారణం ఏమిటి ? బిజేపి అభ్యర్థి తో లోపాయి కారీ ఒప్పందం జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బహిరంగ పరచిన అభిప్రాయం. రాజకీయమంటేనే కుమ్మక్కు అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. శత్రువుకు శత్రువు మిత్రుడేనా ? రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎప్పుడూ ఉండరు.