బద్వేల్: బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ?
బద్వేలులో ఎలాగైనా లక్ష మెజారిటీ సాధించాలన్నది అధికార పార్టీ టార్గెట్గా ఉంటే.. ఎలాగైనా సెకండ్ ప్లేస్లో నిలవాలని కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2014లో విభజన జరిగితే.. ఈ ఏడేళ్లలో ఆ పార్టీ ఏ ఒక్క ఎన్నికలోనూ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు బద్వేలులో కూడా విజయంపై ఎలాగూ ఆశల్లేవు.. కానీ.. ఏపీలో తన ప్లేసును బీజేపీ భర్తీ చేస్తుందన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది.
అందుకే ఎలాగైనా సెకండ్ ప్లేస్లో నిలవడం ద్వారా తానింకా ఈ రాష్ట్రంలో ఉన్నానని ఉనికి నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తాపత్రయ పడుతోంది. ఇక బీజేపీది మరో ఆశ.. ఎలాగూ టీడీపీ పోటీలో లేదు. కాబట్టి అది తనకు లాభిస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. యాంటీ వైసీపీ, యాంటీ గవర్నమెంట్ ఓట్లన్నీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోతాయి. అయితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఎప్పుడో వైసీపీకి షిఫ్టు అయిపోయింది. కాబట్టి ఇక మిగిలిన టీడీపీ ఓటు బ్యాంకుకు తానే ఆప్షన్ గా ఉంటానని బీజేపీ లెక్కలు వేసకుంటోంది.
అటు జనసేన కూడా బద్వేలులో పోటీలో లేదు.. జనసేన ఓట్లు కూడా తనకే పడతాయని బీజేపీ విశ్వసిస్తోంది. అందుకే ఎలాగైనా గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకుని వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. బద్వేలులో సెకండ్ ప్లేస్లో నిలిస్తే.. నైతికంగా తన బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో బాగానే పర్యటించారు.. ప్రచారం చేశారు. మరి బద్వేలు ఓటరు ఎవరిని కరుణిస్తాడో.. యాంటీ వైసీపీ ఓటరు ఎవరిని ఎంచుకుంటాడో అన్నది నవంబర్ 2న కానీ తెలియదు.