హైదరాబాద్ వాసులకు శుభవార్త..! పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు ట్రిప్పులను పెంచినట్టు హైదరాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న వెల్లడించారు. ముఖ్యంగా ఇబ్రాహీంపట్న, ఘట్కేసర్, కీసర, చేవెళ్ల, మొయినాబాద్, గండిమైసమ్మ, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నారు. దాదాపు నగరంలోని అన్ని వైపుల బస్సు సర్వీసులను పెంచనున్నట్టు వెంకన్న వివరించారు.
ఇప్పటికే గండిమైసమ్మ, కీసర, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ వంటి తదితర ప్రాంతాలలోని విద్యాసంస్థలకు రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా అదనపు ట్రిప్పులను పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టడం మొదలు పెట్టారు. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం, హయత్నగర్, రామోజీఫిలింసిటీ, ఘట్ కేసర్, చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కళాశాలలకు రాకపోకలకు సాగించేందుకు విద్యార్థుల కోసం ఉప్పల్, దిల్సుఖ్నగర్, కోఠి, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్టు హైదరాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న చెప్పారు. పలువురు విద్యార్థులు కళాశాలలు ప్రారంభం అయ్యాయని, బస్సులను కళాశాలల సమయానికి అందుబాటులో ఉంచాలని డిపో హయత్ నగర్, ఇబ్రాహీంపట్నం, దిల్సుఖ్నగర్, ఉప్పల్ ప్రాంతాల మేనేజర్ల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడం కోసం అదనపు ట్రిప్పులను పెంచుతున్నామని ఆయన వెల్లడించారు.