మొబైల్ మత్తులో యువత..యూనెస్కో నివేదిక ఏమన్నదో తెలుసా..?
యువతతో పాటు చిన్నపిల్లలు కూడ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ యదార్థ జీవితాను, కుటుంబ, స్నేహితులతో ఉన్న సంబంధాలను వదిలిపెట్టి ఫాంటసీ జీవితాలను గడుపుతూ ఉన్నారు. మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. సెల్ఫోన్కు బానిసలుగా మారి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో జీవితం మీద విరక్తి చెందిన ఆత్మహత్యలు చేసుకుంటూ తమ తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలిస్తున్నారు. ఈ తరుణంలోనే యువత తమ భవిష్యత్ను ప్రశ్నార్థకంగా చేసుకుంటుంది..? ఇందుకు కారణం తమ తల్లిదండ్రులే అని పలువురు పేర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సక్రమదారిలో పెంచితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల యూనెస్కో ఇచ్చిన నివేదిక ప్రకారం.. మొబైల్ఫోన్కు బానిసలై 10 నుంచి 19 ఏండ్ల వయస్సు ఉన్న చిన్నారులు, యువత ప్రతీ సంవత్సరం 45,800 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించింది. ప్రతి 11 నిమిషాలకు ఒకరు బలవన్మరణం అవుతున్నారు. ఈ చిన్నారుల ఆత్మహత్యలకు కారణం ఎవరంటే..? ముఖ్యంగా ఆన్లైన్లో ఆటల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఆడే ఆన్లైన్ ఆటలలో 90 శాతం వరకు హింసను ప్రేరేపించేవిగా ఉంటాయి. మరోవైపు అశ్లీలత కూడ తీవ్ర మానసిక రుగ్మతలకు గురిచేస్తోంది. బ్లూవెల్ వంటి ఆటలు విపరీతంగా ఆడుతూ పిల్లలు పరిసరాలను మరిచిపోతున్నారు. తిండి తినడం, నిద్రహారాలు మాని ఆటలలో మునిగిపోతున్నారు. ఈనేపథ్యంలోనే యువతలో ఆందోళన, చిరాకు, కోపం, అసహనం, హింసాత్మక నైజం పెరిగిపోతుంది. అఘాయిత్యాలు రోజురోజుకు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ఇందుకు ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయో లేదో చూడాలి.