టీఆర్ఎస్-బీజేపీ: గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ..?
మొదట్లో కాంగ్రెస్ను తొక్కిపట్టేందుకు కేసీఆర్ బీజేపీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ.. అసలు తమ శత్రువు బీజేపీనే అన్నట్టు బిల్డప్ ఇచ్చేవారు. అసలు గత ఎన్నికల ముందైతే.. కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫ్రంట్ పెట్టాలని కూడా ప్రయత్నించారు. దీని కోసం కొన్ని రాష్ట్రాలు కూడా తిరిగారు.. దేశ్కీ నేతగా ఎదగాలనుకున్నారు.. కానీ.. ఆ తర్వాత ఆ ప్లాన్ ఉపసంహరించుకున్నారు. గతంలో మోడీని సైతం పరుషంగా విమర్శించిన కేసీఆర్.. ఆ తర్వాత లైట్ తీసుకున్నారు.
ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీ నేతలు టీఆర్ఎస్ పట్ల జోరుగా విమర్శలు చేస్తుంటారు.ఏకంగా కేసీఆర్ను జైల్లో పెట్టిస్తామంటారు. పాపం.. బండి సంజయ్ ఈ మాటలు కొన్ని నెలలుగా చెబుతున్నా.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. అంతే కాదు.. ఢిల్లీలో స్థాయిలో కేసీఆర్ బీజేపీ నేతలతో మంచి సంబంధాలే నిర్వహిస్తున్నారన్న టాక్ ఉంది. తాజాగా టీఆర్ఎస్కు ఢిల్లీలో బీజేపీ సర్కారు స్థలం కేటాయించడం ఇందుకు ఓ నిదర్శనంగా చెబుతున్నారు.
దక్షిణాది నుంచి ఇలా ఓ పార్టీ ఢిల్లీలో కార్యాలయం నిర్మించుకోవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అటు ఏవైనా కీలక బిల్లులు ఉంటే టీఆర్ఎస్ మోడీ సర్కారుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తూనే ఉంది. ఈ వరుస సంఘటనలు చూస్తే.. గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉంది ఈ రెండు పార్టీల బంధం.