రైతు తీసుకున్నటువంటి రుణాలలో 50 వేల లోపు మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినది. దీనిపై ప్రగతిభవన్లో మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల చివరి కల్లా 50 వేల లోపు మొత్తం మాఫీ చేయాలని నిర్ణయించింది. కెసిఆర్ నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులకు రుణాలు మాఫి లాభం జరుగుతుంది. రైతులకు లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగానే తొలి విడతలో 25 వేల లోపు రుణాలు మాఫీ చేసింది. రుణమాఫీలో దాదాపు మూడు లక్షల పైన రైతులు లాభం పొందారు. ప్రస్తుత నిర్ణయంతో ఇంకా ఎక్కువ మంది రైతులకు రుణాలు మాఫి అవుతాయని ప్రభుత్వం తెలిపింది. మొత్తం నాలుగు విడతలలో రుణమాఫీ అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
2021 - 2022 రాష్ట్ర బడ్జెట్ లో 5225 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రైతులకు ఎంతో మేలు చేస్తుంది. 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెరాస ప్రభుత్వ హయాంలో లక్షలోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకున్నదని చెప్పవచ్చు.
ఒక వైపు కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిన కానీ ప్రభుత్వం మాత్రం రైతన్నల విషయంలో వెనక్కి తగ్గడం లేదు అని చెప్పవచ్చు. రైతుబంధు కింద పెట్టుబడి సాయం కూడా అందిస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. దీంతో పాటుగా కరోణ కష్టకాలంలో కూడా ధాన్యం కొనుగోలు చేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గింజను కొనుగోలు చేసింది.
రైతులకు ఎరువులు విత్తనాలను కూడా సకాలంలో అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్న సన్నకారు రైతులకు ఎంతో లబ్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రస్తుతం వానాకాలం సీజన్ కాబట్టి వ్యవసాయ శాఖ చేస్తున్న కార్యాచరణను క్యాబినెట్ పరిశీలించింది. గత కొద్ది కాలంగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండు కుండలా తయారయ్యాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులను మొదలు పెట్టారని క్యాబినెట్ చర్చించింది. అలాగే పత్తికి డిమాండ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎక్కువగా పత్తి సాగు చేయాలని వ్యవసాయ శాఖకు క్యాబినెట్ ఆదేశాలు జారీ చేసింది.