బాబు ఆ విషయంలో ఎందుకు వెనుకబడ్డారు...!

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో కాస్త వెనుకపడినట్లు కనిపిస్తోంది. ఎక్కువగా జూమ్, సోషల్ మీడియాలకే పరిమితమవుతున్న బాబు, ప్రజల్లోకి రావడం తగ్గిందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గతేడాదిన్నర నుంచి ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటాలు చేయలేదనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడుప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. ఈ క్రమంలోనే ప్రజల మధ్యలోకి వచ్చి, వారి సమస్యలపై పోరాటం చేస్తే పార్టీకే బెనిఫిట్ అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

అయితే చంద్రబాబు ఇటీవల పలువురు టీడీపీ నేతలని పరామర్శించడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. బాబు బయటకొస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. అలాగే అక్కడ ప్రజా సమస్యలపై కూడా చంద్రబాబు మాట్లాడుతుంటే, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అలాంటప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్న పలు సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తే బాగుంటుందని అంటున్నారు.

తెలంగాణలో కొత్తగా పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి, వరుసపెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. అదే కార్యక్రమం ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ చేయట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని మీడియా సమావేశాల్లో చెబుతున్నారుగానీ, ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటం చేయడం లేదు. అలాగే రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ధాన్యం డబ్బులు ఇంతవరకు రైతులకు అందలేదు.

నిరుద్యోగుల సమస్యలపై నారా లోకేష్ పోరాటానికి ఎలాగో సిద్ధమవుతున్నారు. అలాగే ఇతర సమస్యలపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే పార్టీకే అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. ఏపీలో ఇప్పుడు అనేక ప్ర‌జా స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీటిపై పోరాటం చేస్తే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీకి మంచి మైలేజ్ రానుంది. మరి రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: