ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. కాగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అంతే కాంకుడా హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్ లలో ఆస్పత్రిని నిర్మించలేరా? అంటూ మరో ప్రశ్నవేసింది. హైకోర్టు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరారు. దాంతో నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అంతే కాకుండా ప్రభుత్వం తీరు దురదృష్టకరమని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఆస్పత్రి సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ ఎందుకు సమర్పించలేదని కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పైన కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నించింది. కాగా వైద్యారోగ్య అధికారులు కరోనా నియంత్రణలో బిజీగా ఉన్న కారణంగా తమకు కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. దాంతో ఆస్పత్రి నిర్మాణం పై 6 వారాల్లో తుది నిర్ణయం తీసుకొని బ్లూ ప్రింట్ ను సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆస్పత్రి పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మిస్తారా? అని ప్రశ్నించింది. లేదంటే కొన్ని బ్లాక్ లలో నిర్మిస్తారా ..? ఏదో ఒకటి చెప్పాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా నిజాం కాలం నుండి ఉస్మానియా ఆస్పత్రి ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరవాత ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తానని..ట్విన్ టవర్స్ ను నిర్మిస్తానని గొప్పలకు పోయారు. అయితే ఇప్పుడు అదే విషయం పై హైకోర్టు సీరియస్ అయ్యింది.