కలుపుకుపోతున్న రేవంత్.. ఏకతాటిపైకి తెస్తాడా..?

Chakravarthi Kalyan
కాంగ్రెస్‌.. అదో విచిత్రమైన పార్టీ.. అందులో అంతా నాయకులే.. ఎవరికి వారు యమునా తీరే. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌కు బాధ్యతలు అప్పగించడంతో సీన్ రసకందాయంలో పడింది. పార్టీలో చాలా మంది తనకంటే ముదుర్లు ఉండటంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. అదిష్టానం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే రేవంత్ పార్టీలోని సీనియ‌ర్లంద‌రినీ క‌లుస్తూ బిజీగా ఉన్నారు. తన ఎంపికపై విమర్శలు చేసిన వీహెచ్‌ను కూడా ఆయన ఆసుపత్రిలో కలిశారు.

సీనియ‌ర్ ఉపాధ్యక్షులు మల్లు రవి నివాసంలో సమావేశమైన కొత్త కార్యవర్గం ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించింది. కొత్తగా నియ‌మితులైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, కార్య నిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు ఈ స‌మావేశంలో  పాల్గొన్నారు.

ఈ భేటీలో రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చరిత్రలో నాలుగు రోజుల పాటు అభిప్రాయ సేకరణ చేసి పీసీసీ నియామకం చేయడం ఇదే మొదటిసార‌న్నారు. తాను సోనియా గాంధీ మనిషినని, చిన్న వయసులో.. తక్కువ సమయంలో త‌న‌కు పెద్ద అవకాశం ఇచ్చారని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ‌ర‌క లాంటిద‌ని పోల్చిన రేవంత్‌.. చిన్న చినుకు ప‌డినా ప‌చ్చగా చిగురిస్తుంద‌న్నారు. కాస్త ఫ్లాష్‌ బ్యాక్ కూడా చెప్పుకొచ్చారు.

వాస్తవానికి త‌మ‌ది కాంగ్రెస్ కుటుంబ‌మ‌ని కానీ స్థానిక ప‌రిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు. నేను మనస్పూర్తిగా కాంగ్రెస్ లోకి వచ్చాను. పార్టీ త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ప‌ద‌వులు ఇచ్చింది. నాకు ఎలాంటి భేషజాలు లేవు. మీ అందరి కంటే చిన్న వాడిని. మీ అందరి అభిప్రాయాలు తీసుకుని..మెజారిటీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాను. క్రికెట్ జ‌ట్టులా ప‌నిచేద్దాం. సోనియా గాంధీ..రాహుల్ గాంధీలు నా పై పెట్టిన న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటా అన్నారు.

తాను ఎలాంటి భేష‌జాలు లేకుండా ప‌నిచేస్తా. నిన్నటి వరకు చూసిన రేవంత్ రెడ్డి వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను ప్యాసింజర్ ట్రైన్ కి డ్రైవర్ ని అని రేవంత్ చెప్పుకొచ్చారు. రేవంత్ చెప్పారు సరే.. సీనియర్లు వింటారా.. సక్రమంగా పార్టీని నడపనిస్తారా.. చూడాలి ఏం జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: