మందు తాగేందుకు కూర్చుని.. అలాగే మరణం.. వైరల్ ఫోటో..!?
కానీ.. మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి.. మందు తాగుదామని.. కూర్చున్న వాడు కూర్చున్నట్టే చనిపోయిన ఘటన హాట్ టాపిక్ అవుతోంది. అతని ఫోటో వైరల్ అవుతోంది. మందులో మంచింగ్ కోసం రొట్టె తెచ్చుకుని దాన్ని తుంచుతున్నవాడు.. అలా తుంచడం పూర్తి కాక ముందే.. కూర్చున్న స్థితిలోనే నోటి నుంచి రక్తం కారుతూ మృత్యువాత పడ్డాడు. విచిత్రం ఏంటంటే అతడు కూర్చున్నది ఎక్కడో ఊరి బయట. దాంతో అతని మరణవార్త తెలిసేందుకు కుటుంబ సభ్యులకు ఓ రోజు పట్టింది. ఇంకా విచిత్రం ఏంటంటే.. వాళ్లు వచ్చే చూసేవరకూ ఆ శవం అలాగే కూర్చున్న స్థితిలోనే ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన కాసాల సాయిలు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు వెళ్లాడు. తూప్రాన్ మీదుగా స్వగ్రామానికి బయలుదేరాడు. తూప్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్ వద్ద మందు కోసం ఆగాడు. మందు, మంచింగ్ తెచ్చుకొని తూప్రాన్-గజ్వేల్ రహదారి పక్కన కొద్ది దూరంలో కూర్చున్నాడు.
మందు ఓ గుక్క నోట్లో పోసుకుని.. మంచింగ్ కోసం పేపర్ ప్లేట్లో చేయి పెట్టాడు. ఇంతలో అనూహ్యంగా గుండెపోటు వచ్చినట్టుంది.. లేక మరేదైనా సమస్యో తెలియదు కాని.. నోటి నుంచి రక్తం కక్కుకుని అలాగే చనిపోయాడు. సాయిలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెతుకుతుంటే.. సాయిలు మృతదేహం కూర్చున్న స్థితిలో కనిపించింది. సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వల్ల గుండెపోటు వచ్చి నొప్పి, ఆనవాళ్లు తెలియకుండా ప్రాణాలు పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.