వరంగల్ జైల్లో కేసీఆర్.. ఖైదీలతో ఏం మాట్లాడారంటే..?
అంతే కాదు.. ఖైదీలతో కొద్దిసేపు మాట్లాడిన కేసీఆర్.. జైల్లో వారిసమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. వారి బాధలు ఓపికతో ఆలకించారు.. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. ఈ సమయంలో కొందరు ఖైదీలు సీఎం కేసీఆర్కు కొన్ని అభ్యర్థనలు అందించారు. సీఎం కేసీఆర్ వారి అభ్యర్థనలను స్వీకరించారు. వరంగల్ పర్యటనలో భాగంగా.. ఎంజీఎం సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని కేసీఆర్ తెలిపారు. అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎంసీహెచ్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాను విస్త్రృత పరిచి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం ఇక్కడికి వచ్చే విధంగా సకల సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు.
వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటనే పటిష్ట పరుచుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి తరలించే సెంట్రల్ జైలు కోసం నగర శివార్లలో విశాలమైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ సెంట్రల్ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులాగా, ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు, కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, లాక్ డౌన్ అమలు పై కూడా సీఎం కేసీఆర్ కూలంకంశంగా చర్చించారు.