కరోనాపై సరికొత్త అస్త్రం.. వైరస్ ఇక మటాష్!!
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం ఎంతో ఆరోగ్యకరమైన భాగస్వామ్యానికి ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. మహమ్మారిని అరికట్టేందుకు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు దాదాపు ఏడాది శ్రమించి ఈ 2డీజీ ఔషధాన్ని తయారు చేశారు. ఈ ఔషధాన్ని హైదరాబాద్ రెడ్డీస్ ల్యాబ్ వారు ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోని విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం ఆరోగ్యకరమైన భాగస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని రాజ్ నాథ్ అన్నారు. అంతేకాకుండా 2డీజీ ఔషధం కరోనా రికవరీ సమయాన్ని తగ్గించడమే కాకుండా, అధిక ఆక్సిజన్ వినియోగానికి కూడా అడ్డుకట్ట వేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్దన్ అన్నారు. అంతేకాకుండా డీఆర్డీఓ ఈ ఔషధానికి ఇంకా ధరను నిర్ణయించలేదని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే కరోనాను కట్టడి చేసేందుకు డీఆర్డీఓ ఏడాది పాటు చేసిన కృషికి ఫలితం ఈ 2డీజీ (2-డయాక్సీ డీ-గ్లూకోజ్) ఔషధం. గతంలో దీనిని క్యాన్సర్ను అడ్డుకునేందుకు తయారుచేశారు. ఈ ఔషధం క్యానర్స్ కణానికి గ్లూకోజ్ అందకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు అదే సూత్రాన్ని అన్వయించుకొని పరిశోధనలు చేశామని, శరీరంలోకి ప్రవేశించిన కరోనా కణాలకు గ్లూకోజ్ అందకపోతే, వాటి కణ విభజన నిలిచిపోతుందని, దాని కారణంగా కరోనా వ్యాప్తి జరగదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ ఔషధం కీలక పాత్ర పోషించనుందని, దీని ధరను అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్ణయిస్తామని వారు తెలిపారు.