
మోడీ దండయాత్ర అడ్డుకున్న ఒక్క మగాడు - మమత..?
ప్రజాస్వామ్యంలో ప్రజల మెప్పు పొందడం అంత సలభమేమీ కాదు.. అందులోనూ.. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ పెత్తనం, నాయకత్వం అంత సులభం కాదు. అలాంటిది మమత విజయవంతంగా తన పార్టీని నడిపిస్తోంది. ఇక ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంత సులభం కానే కాదు.. ప్రజల ఆకాంక్షలు ఆ రేంజ్లో ఉంటాయి. అందుకే కొన్ని రాష్ట్రాల్లో అధికార మార్పిడి ఓ ఆనవాయితీగా సాగుతుంటుంది.
అలాంటిది మమత ఏకంగా మూడోసారి బంపర్ మెజారిటీతో గెలిచారు. అందులోనూ పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో ఆమె విజయయాత్ర సాగించారు. దేశమంతా మోడీ మోడీ అంటూ ఆకాశానికెత్తుస్తున్న కాలంలో అదే మోడీని మమత నేల మీదకు దింపారు. మమత బెనర్జీని ఓడించేందుకు మోడీ- అమిత్ షా ద్వయం వేయని ఎత్తులు, జిత్తులు లేవు. అలాంటిది మమత అన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నారు.
కేంద్రంలో అధికారం చేతిలో ఉంది.. చేతిలో ఆడినట్టల్లా వినే ఎన్నికల సంఘం ఉందన్న విమర్శలు వచ్చాయి. మమత మెడలు వంచితే ఇక దేశంలో ఎదురుండదన్న అంచనాలు ఉన్నాయి. అందుకే మోడీ - అమిత్ షా బెంగాల్లో పాగా వేసేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. ధనబలం, కండ బలం, అధికార బలం.. ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా మమత విజయంతంగా మోడీ దండయాత్రను ఎదిరించారు. విజేతగా నిలిచారు. అందుకే మోడీ దండయాత్ర అడ్డుకున్న ఒకే ఒక్క మగాడు మమత అనిపించుకుంటున్నారు.