కేసీఆర్‌ ను కదిలించిన ఇండియా హెరాల్డ్‌..!

Chakravarthi Kalyan
ప్రైవేటు టీచర్ల కష్టాలపై ఇండియా హెరాల్డ్ రాసిన వరుస కథనాలకు స్పందన లభించింది. ఇండియా హెరాల్డ్ కథనాలు సీఎం కేసీఆర్ ను కదిలించాయి. కరోనా కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలు కష్టాలకు చిరునామాగా మారాయి. ఒక్క తెలంగాణలోనే బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో రెండున్నర లక్షల మంది ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు రెండు లక్షల మంది టీచర్లు లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నాలుగు వేలకుపైగా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. పాఠశాలలు తెరుచుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించిన ప్రైవేటు టీచర్లలు నిరాశే ఎదురైంది. ఇంతలో మళ్లీ పాఠశాలలు మూతబడ్డాయి.
ఈ ప్రైవేటు టీచర్ల కష్టాల గురించి ఇండియా హెరాల్డ్ వరుస కథనాలు ప్రచురించింది. ప్రైవేటు టీచర్ల తరపున గళం వినిపించింది. వారి ఇబ్బందులుపై ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుల తరబడి కథనాలు ప్రచురించింది. ఈ కథనాలు చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కదిలించాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో  ఇబ్బందులు ఎదుర్కుంటున్న,  గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి  నెలకు రూ. 2000 ఆపత్కాల  ఆర్ధిక సాయం తో పాటు  కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి ప్రయివేటు  విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో  స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సిఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ  విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సిఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను  మానవీయ దృక్ఫథంతో  ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కి లబ్ధిచేకూరుతుంది. ప్రైవేటు టీచర్ల పట్ల మానవత్వంతో స్పందించిన కేసీఆర్‌కు ఇండియా హెరాల్డ్‌ ధన్యవాదాలు చెబుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: