జగడ్డ: ఆ టెక్నాలజీతో.. వైసీపీ పరువు అడ్డంగా తీసేస్తున్నారుగా...?

Chakravarthi Kalyan
టెక్నాలజీ.. ఇప్పుడు ఈ కొత్త యుగంలో ఇదే ఆయుధం.. అవును.. తిమ్మిని బమ్మిని చేయాలన్నా.. అబద్దాన్ని నిజమని నమ్మించాలన్నా ఇప్పడు టెక్నాలజీయే ఆయుధం.. అందుకే ఆ టెక్నాలజీ సాయంతో అబద్దాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. నిజం ఇంటి గడప దాటే లోపు అబద్దం ప్రపంచం చుట్టువస్తోంది.. ఇందుకు తాజాగా ఉదాహరణ.. వైసీపీ పోల్స్ వెబ్‌ సైట్‌ అంశం.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార, విపక్షాలు ఏ పార్టీకి ఆ పార్టీ మేమే విజయం సాధించుకున్నామని ప్రకటిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా కాబట్టి.. కచ్చితంగా ఏ పార్టీ ఎన్ని గెలిచిందనేది చెప్పేలని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకుని తామే ఎక్కువ సీట్లు గెలుచుకున్నామని పార్టీలు చెబుతున్నాయి. మొదటి విడతలో దాదాపు 40 శాతం సీట్లు గెలిచామని టీడీపీ ప్రకటించంది. దీన్ని తప్పుబట్టిన వైసీపీ.. తమ ఫలితాలను ఓ వెబ్ సైట్లో పెడుతున్నామని ప్రకటించింది.
రాజధాని ప్రాంతంలోనూ తమకు మంచి ఫలితాలు వచ్చాయన్న వైసీపీ నేతలు.. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పైగా వైకాపా క్లీన్ స్వీప్ చేసిందన్నారు.  గెలుపొందిన అభ్యర్థుల ఫొటోలతో సహా వెబ్ సైట్లో పెడతాం.. వీలైతే నిరూపించండి.. అని సవాల్ చేశారు. వైసీపీ అంత నమ్మకంగా చెప్పేసరికి అంతా ఆ వెబ్ సైట్ కోసం వెదకడం మొదలుపెట్టారు. అలాంటి వారికి వైఎస్ఆర్సీ పోల్స్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ కనిపించింది. కానీ అందులో అంతా తప్పుడు సమాచారం ఉంది. దీంతో వైసీపీ ఫ్యాన్స్ ఖంగు తిన్నారు. వైసీపీ సోషల్ మీడియా సెల్ ను ఆశ్రయించారు. ఆ తర్వాత పరిశీలనతో తేలిందేమిటంటే.. అదో నకిలీ వెబ్ సైట్‌..
అందుకే.. ఇప్పుడు ఈ నకిలీ వెబ్ సైట్‌పై వైసీపీ గుర్రుగా ఉంది.. పంచాయతీ ఎన్నికల వివరాలను కలిగి ఉన్న వైఎస్ఆర్సీ పోల్స్ డాట్ ఇన్  వెబ్ సైట్ కు నకిలీని రూపోందించటంపై  సీఐడీకి ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీ పోల్స్ డాట్ కామ్ అనే నకిలీ వెబ్ సైట్ పై సైబర్ నేరాల కింద కేసు పెట్టాలని కోరింది. తక్షణమే వైఎస్ఆర్సీ పోల్స్ డాట్ కామ్ అనే నకిలీ వెబ్ సైట్ ను నిలిపివేయాలంటూ  సీఐడీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: