కడప జిల్లా టీడీపీ నేత హత్య.. షాకిస్తున్న కొత్త కోణం..?
అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ హత్య విషయంలో ఓ కొత్త కోణం బయటకు తెస్తున్నారు. హత్యా రాజకీయాలను, ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించింది టీడీపీనే అంటున్నారు వైసీపీ బీసీ నేతలు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే జోగి రమేష్. ప్రొద్దుటూరులో జరిగిన హత్య విషయంలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ విమర్శలు పూర్తి బాధ్యతా రాహిత్యమని వారు తీవ్రంగా ఖండించారు. రాయలసీమలో ప్రశాంతతకు భంగం కలిగించే రాజకీయాన్ని చేసిన చంద్రబాబు, ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్టు నటిస్తుండటం, బీసీల మీద దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం. ఈ హత్య ఎవరు చేసినా కచ్చితంగా వారిని శిక్షించాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందని వైసీపీ బీసీ నేతలు స్పష్టం చేశారు.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది అవినీతి మీద సుబ్బయ్య నిలదీసినందువల్లే ఆయన్ను హత్య చేశారంటూ జరుగుతున్న ప్రచారం కూడా పూర్తి బాధ్యతారాహిత్యమేనంటున్నారు వైసీపీ బీసీ నేతలు. ఎందుకంటే.. టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు ఇదే సుబ్బయ్య మీద టీడీపీ ప్రభుత్వంలోనే నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేస్తే.. అందులో రెండింటిలో ఆయనకు శిక్ష పడిందని గుర్తు చేస్తున్నారు. గత ఇరవై ఏళ్ళుగా సుబ్బయ్య మీద అనేక కేసులు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈరోజు టీడీపీ వారు తమ అధికార ప్రతినిధి అని చెబుతున్న సుబ్బయ్య మీద టీడీపీ హయాంలోనే కేసులెందుకు పెట్టారన్న ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
ఈ హత్య చేశారని సుబ్బయ్య కుటుంబం ఆరోపిస్తున్న వ్యక్తులను పోలీసులు వెంటనే అరెస్టు చేశారని... వారికీ, సుబ్బయ్యకు మధ్య ఒకప్పుడు మంచి స్నేహం ఉండేదని, తర్వాతకాలంలో వ్యక్తిగత కారణాల వల్ల వారి మధ్య వైరం పెరిగిందని, అది కక్షల స్థాయికి చేరిందని వైసీపీ బీసీ నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు.