స‌రికొత్త రైతు విప్ల‌వానికి ' ఏలూరి ' శ్రీకారం... దేశానికే ఆద‌ర్శంగా ప‌రుచూరు

VUYYURU SUBHASH
ఆయ‌న ప్ర‌భుత్వంలో లేరు. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేదు. కానీ.. ఆయ‌న మాత్రం ప్రభుత్వం చేయ‌ని, చేయ‌లేని ప‌నిని భుజాన వేసుకుని అద‌ర‌హో! అని అంద‌రితో నూ శ‌భాష్ అనిపించుకుంటున్నారు. ఆయ‌నే ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే టీడీపీ యువ నాయ‌కుడు ఏలూరి సాంబ‌శివ‌రావు. స్వ‌త‌హాగా వ్య‌వ‌సాయ అధికారి కావ‌డంతో ఆయ‌న‌కు రైతుల క‌ష్టాలు తెలుసు. సాగులోకి దిగిన రైత‌న్న‌.. ప‌డే బాధ‌లూ తెలుసు. అంతేకాదు.. స‌మాజంలో ఎవ‌రూ మోస‌పోని విధంగా అడుగ‌డుగునా.. మోస‌పోతున్న రైతుల క‌ష్టాలు కూడా ఆయ‌న‌కు తెలుసు.

రైతు బాగుంటే.. స‌మాజం.. త‌ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గం .. దీనికి కొన‌సాగింపుగా రాష్ట్రం, దేశం కూడా బాగుంటాయ‌ని భావించే ఏలూరి.. తాను అధికారంలో లేక పోయినా.. త‌న పార్టీ అధికారంలో లేక పోయినా.. రైత‌న్న‌కు మాత్రం అన్నీ తానై వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. రైతులు ప్ర‌ధానంగా మోస‌పోయేది.. విత్త‌నాల ఎంపికలోనే. వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సాగుచేసినా.. విత్త‌నాలు స‌రిగా లేక‌పోతే.. పంట చేతికి అంద‌దు. అప్ప‌టి వ‌ర‌కు చేసిన క‌ష్టం.. పెట్టిన పెట్టుబ‌డి కూడా పూర్తిగా నీటిలోపోసి న‌ట్టే. ఈ విష‌యం తెలిసిన ఏలూరి.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు ఎక్కువ‌గా పండించే మిర‌ప విత్త‌నాల విష‌యంలో త‌నే స్వ‌యంగా రంగంలోకిదిగారు.
నాణ్య‌మైన మిర‌ప విత్త‌నాల‌ను ఖ‌రీదు ఎక్కువే అయినా.. త‌న స్వంత నిధుల‌తో సేక‌రించి.. మొక్క‌ల‌ను కేవ‌లం 1.20 పైస‌ల‌కు రైతుల‌కు అందించి.. వారిని ప్రోత్స‌హించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అంతే కాదు, స‌రైన స‌మ‌యంలో వాటిని అందించ‌డం ద్వారా సాగును ప్రోత్స‌హించేందుకు రైతు భ‌రోసాకు న‌డుం బిగించారు. తానే స్వ‌యంగా కొన్ని బృందాల‌ను ఏర్పాటు చేసి... త‌న నియోజ‌క‌వ ‌ర్గంలోని ప్ర‌తి రైతు ఇంటికీ.. మిర‌ప మొక్క‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. త‌ద్వారా రైతుల‌కు క‌ష్టం న‌ష్టం రాకుండా చూసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు  ఈ సాగు సీజ‌న్‌లో 42,86,500 మొక్క‌ల‌ను పంపిణీ చేశారు.
వాస్త‌వానికి 25 ల‌క్ష‌ల మొక్క‌లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ, రైతుల నుంచి స్పంద‌న బాగుండ‌డంతో .. మ‌రింత‌గా ఈ సంఖ్య పెరిగింది. అయినా.. వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చుకుని ఎమ్మెల్యే రైతు భ‌రోసానే త‌న‌కు ఆశీర్వాదంగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నారు. నిజానికిత‌మ‌ది రైతు ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పుకొనే జ‌గ‌న్ స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి కార్య‌క్ర‌మానికి ఎక్క‌డా శ్రీకారం చుట్ట‌లేదు. పైగా.. ఆ పార్టీ నేత‌లు కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. కానీ.. టీడీపీ నాయ‌కుడిగా క‌న్నా.. రైతుల క‌ష్టం తెలిసిన ప్ర‌జాప్ర‌తినిధిగా ఏలూరి చేస్తున్న ప్ర‌య‌త్నం న‌భూతో.. అని అన‌కుండా ఉండ‌లేక పోతున్నారు స్థానికులు.
ఏలూరి శ్రీకారం చుట్టిన ఈ విప్ల‌వం ఇప్పుడు దేశంలో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, ఎమ్మెల్యేల‌కు ఆద‌ర్శంగా మారింది. పార్టీల‌కు అతీతంగా ప‌లువురు ఆయ‌న్ను ప్ర‌శంసిస్తున్నారు. ఆయ‌న ఇప్పుడే కాదు.. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఇక్క‌డి రైతుల క‌ష్టాలు, క‌న్నీళ్లు తుడిచే ప్ర‌య‌త్నం చేసి శ‌భాష్ అని అనిపించుకున్నారు. ఇదే ఆయ‌న‌ను రెండోసారి జ‌గ‌న్ సునామీలోనూ సునాయాసంగా విజ‌య‌తీరాల‌కు చేర్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: