గ్రేటర్ యుద్ధం: పాతబస్తీలో మజ్లిస్ పార్టీ హవా..!
పురానాపూల్లో బీజేపీ అభ్యర్థి కె.సురేందర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు జెండాలు పట్టుకుని గల్లీల్లోని ఇళ్ల వద్దకు చేరుకుని ఈ ఎన్నికల్లో కె.సురేందర్కే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టని మజ్లిస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. డివిజన్ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉన్నాయని.. ఈసారి తన విజయం ఖాయమని పురానాపూల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పెండ్యాల లక్ష్మన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ తనకే ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ కృషి చేస్తోందని, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలే తన విజయానికి దోహదం చేస్తాయన్నారు.
ఘాన్సీబజార్ అభ్యర్థి అనూష గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ ఇంచార్జి మహ్మద్ సలావుద్దీన్ లోధి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, డివిజన్ ఎన్నికల పరిశీలకుడు మోహన్గాంధీ నాయక్తో కలిసి డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి అనూషగౌడ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ లోధీ మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. డివిజన్ అభివృద్ది కోసం కృషి జరుగుతుందన్నారు.