దేశ ఆర్థిక రాజధానిలో గందరగోళం..!
ఏం జరిగిందో తెలియదు. ముంబై ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లింది. నగరం మొత్తం ఉన్నట్టుండి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం పదింటి నుంచి నగరం మొత్తం స్తంభించింది.అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయలేదు. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందిపడ్డారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది.
ముంబైకి టాటా కంపెనీ కరెంట్ సరఫరా చేస్తోంది. కాల్వా-పడ్ఘే పవర్హౌస్లోని రెండో సర్క్యూట్ సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఉదయం 10గంటలకు థానే, ముంబై రీజియన్లలో కరెంట్ ఆగిపోయింది. ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పవర్ ఫెయిల్యూర్గా అధికారులు చెబుతున్నారు. రెండు మూడు గంటల్లో కొన్ని ప్రాంతాలకు పునరుద్దరించారు. ప్రస్తుతం అదానీ ఎలక్ట్రిసిటీ అత్యవసర విభాగాలకు కరెంటు సరఫరా చేస్తోంది.
వెంటనే అలర్టయిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే... విచారణకు ఆదేశించారు. దేశ ఆర్థిక రాజధానిలో... ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పవర్ కట్పై నెటిజన్లు తమ క్రియేటివిటీ చూపించారు. బాలీవుడ్ పాటలు, ఫన్నీ డైలాగ్స్తో మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పవర్ కట్తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి పండగే అంటూ కొందరు మీమ్స్ చేశారు. మరి కొందరు బాహుబలి సినిమాలోని ప్రభాస్, సత్యరాజ్ల సన్నివేశానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. నగరంలో దండోరా వేయించు మామ అంటూ కామెంట్స్ రాశారు.
మొత్తానికి దేశ ఆర్థిక రాజధాని ముంబయి స్థంభించిపోయింది. కరెంట్ సరఫరా ఆగిపోవడంతో అల్లకల్లోలమయిపోయింది. ముఖ్యంగా సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో పలు సంస్థల్లో తికమక నెలకొంది. ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.