వైసీపీ వారియర్స్: ఓడినా..వెనక్కి తగ్గట్లేదుగా...

M N Amaleswara rao
రాజకీయాల్లో అందరికీ గెలుపు దక్కడం చాలాకష్టం. అలా అని ఓటమి ఎప్పుడు శాశ్వతం కాదు. ఇక ఇదే విషయాన్ని వైసీపీ నేతలకు బాగా అర్ధమైనట్లు ఉంది. గత ఎన్నికల్లో జగన్ బొమ్మతో కూడా కొందరు నేతలు ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి 23, జనసేన నుంచి ఒకరు గెలవడంతో, వైసీపీ తరుపున 24 మంది నాయకులు ఓడిపోయారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో, ఓడినా నేతలు ఈసారి తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు.

కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు అభ్యర్ధులని మార్చి, జగన్ వేరే వారిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కొన్నిచోట్ల ఓడిపోయిన అభ్యర్ధులే ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేస్తున్నారు. అయితే ఓడిపోయిన నేతలకు జగన్ వేరే పదవులు కూడా ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చారు.  కానీ మండలి రద్దుతో వారికి రాజ్యసభ కేటాయించారు.

ఇక హిందూపురంలో ఓడిపోయిన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ, గన్నవరం నియోజకవర్గంలో ఓటమి పాలయిన యార్లగడ్డ వెంకట్రావుకు కృష్ణా డి‌సి‌సి‌బి ఛైర్మన్, విశాఖ సౌత్‌లో ఓడిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ మెట్రో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్, పాలకొల్లు ఇన్‌ఛార్జ్ కవురు శ్రీనివాస్‌కు వెస్ట్ డి‌సి‌సి‌బి ఛైర్మన్ పదవి, పర్చూరు ఇన్‌ఛార్జ్ రావి రామనాథం బాబుకు ప్రకాశం జిల్లా సహకార సంఘం అధ్యక్షుడి పదవి ఇచ్చారు.

అయితే మిగిలిన వారికి పదవులు దక్కకపోయినా సరే నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏమన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తున్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగానే ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకెళుతున్నారు. మొత్తానికైతే ఈ వైసీపీ వారియర్స్, ఎన్నికల్లో ఓడినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: