సంచలనం: జైలుకు వెళ్లడానికి జగన్ రెడీ.. ఇదిగో ప్లాన్‌బీ అంటున్న ఏబీఎన్‌ ఆర్కే..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్.. ఏ నిమిషంలోనైనా తాను జైలుకు వెళ్లేందుకు రెడీ అయ్యారా.. ఒక వేళ తాను జైలుకు వెళ్లాల్సివస్తే ఏంచేయాలో ఇప్పటికే ప్లాన్ బీ రెడీ చేసుకున్నారా.. బీజేపీ పెద్దలకు కోపం వస్తే తనను ఎప్పుడైనా జైలుకు పంపిచేస్తారన్న సంగతి జగన్ కు తెలుసా.. అందుకే అదానీ వంటి పెద్దలతో జగన్ సంబంధాలు పెట్టుకుని బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారా.. ఇదంతా నిజమే అంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.


ఆయన తాజాగా తన పత్రికలో రాసిన కొత్త పలుకు వ్యాసంలో ఈ విషయం గురించి డిటైల్డ్ గా వివరించారు. ఏబీఎన్ రాధాకృష్ణ అంచనాల ప్రకారం.. అవినీతి కేసుల నుంచి విముక్తి పొందడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరపుతూనే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా జగన్‌ రెడ్డి రూపొందించుకున్నారట. కేసుల నుంచి బయటపడే విషయంలో సహాయ పడతారన్న నమ్మకంతో గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అదానీతో ఆయన సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని ఆర్కే చెబుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడరేవులను, ఇతర వ్యాపారాలను హస్తగతం చేసుకోవడంలో అదానీకి జగన్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందట. ముంబై ఎయిర్‌ పోర్టులో వాటా ఇవ్వడానికి నిరాకరించిన జీవీ కృష్ణారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ, ఈడీ కేసులలో ఇరికించిన అదానీ ఇప్పుడు జగన్‌ రెడ్డి బలహీనతను ఆసరాగా తీసుకొని రాష్ట్రంలో పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అదానీ చెప్పినంత మాత్రాన జగన్‌ను కేసుల నుంచి బీజేపీ పెద్దలు విముక్తం చేస్తారని చెప్పలేకపోయినా.. అంబానీ, అదానీ సహకారంతో కేసుల నుంచి బయటపడాలని జగన్‌ అనుకుంటున్నారట.


ఒకవేళ ఈ ప్రయత్నాలేవీ ఫలించని పక్షంలో మళ్లీ జైలుకు వెళ్లడానికి కూడా జగన్‌ రెడ్డి ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించుకున్నారట. అవినీతి కేసులలో తనకు శిక్షపడి జైలుకు వెళ్లవలసి వస్తే ముఖ్యమంత్రిగా తన స్థానంలో తన భార్య భారతిని నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ఆర్కే బయటపెట్టారు. అయితే ఇలాంటి ఊహాగానాలు ఆర్కే గతంలోనూ చాలా రాసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: