జగన్ దూకుడు : డిఫెన్సులో కేసీఆర్..?

Chakravarthi Kalyan
రాయలసీమ ఎత్తిపోతల అంశంపై ఏపీ సీఎం జగన్ దూకుడుగా వెళ్తుండటం.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంకటంగా మారింది. ఈ విషయంపై తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లను నిలిపేయాలని కోరింది. అయితే ఇంతటి ముఖ్యమైన అంశంపై కేసీఆర్ ఇప్పటి వరకూ మీడియా ముందు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీంతో ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.


పోతిరెడ్డిపాడు అంశంలో కేసీఆర్ మౌనంవెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ జూమ్ అప్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. అసలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హాజరుకాకుండా కేబినెట్ భేటీ ఎందుకు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. కృష్ణానది జలాల వివాదాలపై మీటింగ్ కంటే కేబినెట్ భేటీ ముఖ్యమా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టు లో వేసిన పిటిషన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపేందుకు ఒక్క అంశం కూడా లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.


సుప్రీంకోర్ లో వేసిన పిటీషన్ కాపీలో కర్ణాటక-మహారాష్ట్రలను ఎందుకు చేర్చారో ప్రభుత్వం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పోతిరెడ్డిపాడు అంశం పై కేసీఆర్ వైఫల్యం చెందారని.. అందుకే  కేసీఆర్ వెంటనే రాజీనామా చెయ్యాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కు నీళ్లు తీసుకుపోతా అని ప్రకటన చేస్తే... కేసీఆర్ ఎందుకు జగన్ తో మాట్లాడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఒకవేళ కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా రాకుండా పోతే కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఉత్తమ్.


పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చెయ్యాలని.. పోతిరెడ్డిపాడు రాయలసీమ వల్ల దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు అంశంపై తాను వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: