ఈ కరోనా వింతలు చూస్తే ప్రపంచం చిగురుటాకులా వణకాల్సిందే...!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తుంది. రోజురోజుకీ కరోనా ఉగ్రరూపం కాదు ఏకంగా మహోగ్రరూపం చూపిస్తోంది. నిమిషం నిమిషానికి కరోనా మీటర్ లెక్కలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇక ఇప్పటికే కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా 1.5 కోట్లు దాటేశాయి. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 15,380,140 నమోదు అయ్యాయి. ఇందులో కరోనాతో మరణించిన వారి సంఖ్య 630,343 గా ఉంది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,355,528 గా ఉంది.
ఇక కరోనా దెబ్బతో వణికిపోతన్న మిగిలిన రాజ్యాల సంగతేమో గాని అగ్ర రాజ్యం అమెరికా అయితే పూర్తిగా చేతులు ఎత్తేస్తోంది. చివరకు అమెరికన్లు మాస్క్లు కూడా తీసేసి బయట స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అక్కడ 50 వేల కేసులు నమోదు అయితే రేపో మాపో అవి ఏకంగా 70 వేలకు చేరుకోనున్నాయి. ఒక్క రోజే ఏకంగా 70 వేల కేసులు అంటే పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని స్పష్టమవుతోంది. అమెరికాలో మాత్రమే ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల సంఖ్య 4100875కు చేరింది. ఇప్పటివరకూ 146183 మంది మృతి చెందారు. ఇక యూరప్ దేశాలతో పాటు భారత్లోనూ కేసుల సంఖ్య పెరుగుదల మామూలుగా లేదు.
ఇక భారత్కు విషయానికి వస్తే మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, బెంగాల్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కేసుల విజృంభణకు అడ్డూ అదుపు లేదు. మహారాష్ట్రలో కేసులు ఒక ఎత్తు అయితే... దేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో కేసులు అన్ని ఒక ఎత్తుగా ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలోనే ఎక్కువ మరణాలు నమోదు అవుతున్నాయి. ఇక మన దేశంలో ఇప్పటి వరకు కోటి 50 లక్షల 75వేల మందికి పైగా కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ లెక్కలు చూస్తుంటేనే కరోనా ప్రపంచాన్ని ఎంతలా భయపెడుతోందో అర్థమవుతోంది.