పవన్ కు మరో షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే....?
ఏపీ రాజ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడంతో వారిరువురు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వాళ్ల స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణలకు మంత్రులుగా అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాపాక వరప్రసాద్ నూతన మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు.
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు ఇస్తున్నారు. పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా అధికారంలో ఉన్న వైయస్సార్సీపీకి రాపాక ఎల్లప్పుడూ మద్దతు ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా ఆయన పవన్ కు మరో షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను రాపాక అభినందించారు.
ఈరోజు మధ్యాహ్నం మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర రాపాక పుష్ప గుచ్ఛాలతో కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. రాపాక మంత్రి ధర్మాన కృష్ణదాస్కూ పుష్ప గుచ్ఛం అందించారు. పవన్ కళ్యాణ్ పార్టీలో రాపాకకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. గతంలో రాపాక పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు చేశారు. పార్టీలో ఉన్నా పార్టీతో అంటీముట్టనట్లుగా రాపాక వ్యవహరిస్తున్నారు.
తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కనిపించని దేవుడు జగన్ అని ప్రశంసించిన రాపాక అప్పటినుండి సీఎం అమలు చేస్తున్న నిర్ణయాలను, పథకాలను ప్రశంసిస్తున్నారు. సీఎం జగన్ హాజరయ్యే కార్యక్రమాలకు హాజరవుతూ పవన్ కు, జనసేన నేతలకు షాకులు ఇస్తున్నారు. రాపాక అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై జనసేన నేతలు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.