కేంద్ర కేబినెట్లోకి వైసీపీ.. నిజం ఎంత...??
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో పారదర్శకమైన పాలనను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో అప్పట్లో అధికారంలో ఉన్న టిడిపి మాదిరిగా తాము ఇచ్చిన హామీలు మరువమని, తప్పకుండా కేంద్ర సాయంతో ఏపీకి రావలసినవి అన్ని రప్పిస్తామని చెప్పడం జరిగింది. ఇక కొద్దిరోజులుగా కేంద్ర క్యాబినెట్ లో వైసిపికి రెండు బెర్తులు దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు పలు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
మొదటి నుండి కూడా కేంద్ర ఎన్డీయే మరియు బీజేపీ పక్షాలతో కొంత సామరస్యంగా వ్యవహరిస్తున్న జగన్, కేంద్రం లో బెర్తులు ఆశిస్తే ఇక్కడ మైనారిటీల నుండి కొంత సమస్య ఎదురుకావచ్చని ఆలోచనలో పడ్డారని, అయితే ప్రస్తుతం అందరినీ కలుపుకుపోతూ, ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా చూసుకునే విధంగా పాలన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా వైసిపి నేత విజయ్ సాయి రెడ్డి ఢిల్లీ వెళ్తూ, వస్తూ ఉండడంతో పాటు అక్కడి నాయకులకు కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా విందు ఇవ్వడంతో వైసిపికి కేటాయించదలచిన బెర్తుల్లో ఒకటి విజయసాయికి ఖాయం అయిందని కూడా వార్తలు వెలువడుతున్నాయి.
ఇక రెండోది ఎస్సీ లేదా కాపు లేదా కాపు మహిళకు ఇవ్వాలని జగన్ యోచన చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎన్డీయే నుండి శివసేన బయటకు వెళ్లడంతో బీజేపీకి రాజ్యసభలో బలం కొంత తగ్గిందని, అందువలనే ఆంధ్ర నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి రెండు బెర్తులు ఖాయం చేయబోతున్నట్లు టాక్. ఇటీవల ఈ విషయమై కొందరు కేంద్ర మంత్రులు విజయసాయి రెడ్డి వద్ద ఈ ప్రస్తావన తీసుకువచ్చారని, అయితే విజయసాయి మాత్రం ఔననీ, కాదని చెప్పలేదట. ప్రస్తుతానికి తటస్తంగా ఉన్నా ఎప్పుడైనా చేరే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.......!!