ఆంధ్రా అభివృద్ధికి హైదరాబాద్ ఆదాయం..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహంగా మెలగుతున్న ఏపీ సీఎం జగన్ కు ఏపీ ప్రతిపక్షం తెలుగుదేశం ఓ అద్భుతమైన సలహా ఇస్తోంది. ఎలాగూ నీళ్లు కలసి పంచుకుంటున్నాం కదా.. హైదరాబాద్ ఆదాయం కూడా కలసి పంచుకుందామని కేసీఆర్ ను అడగాలని టీడీపీ ఉచిత సలహా ఇస్తోంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ ల భేటీని విమర్శిస్తూ ఈ కామెంట్స్ చేశారు.
గోదావరి, కృష్ణా నీళ్లు కలిపి వాడుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారని, అదే మాదిరిగా హైదరాబాద్ ఆదాయాన్ని కూడా పంచుకోవడానికి ఆయన ముందుకొస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎదిగింది. అక్కడ ఆదాయం సముపార్జించి ఇస్తున్నవారిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఆ నగరం ఆదాయం కూడా పంచుకోవడానికి కేసీఆర్ ముందుకొస్తే ఆదర్శనీయంగా ఉంటుందని సోమిరెడ్డి అంటున్నారు.
తెలుగుదేశం నేతల కొత్త వాదనలో ఆంతర్యం అర్థమవుతూనే ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సయోధ్య వాతావరణాన్ని ఇరుకున పెట్టేందుకే ఇలాంటి వాదనలు ఉపయోగపడతాయి తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అయినా ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా.. హడావిడికిగా అమరావతికి పరుగు తీసిన తెలుగుదేశం ఇప్పుడు ఇలా సన్నాయి నొక్కడం విశేషం.