టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుని అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. గత అయిదేళ్లలో టిడిపి ప్రభుత్వం ప్రజల అంచనాలను తగినట్లుగా రాష్ట్రపాలన చేయలేదని సుస్పష్ట ప్రకటన చేసిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గుఱించి సానుకూల వ్యాఖ్యలు చేసారు.
టీడీపీ వదలి వెళ్ళేది లేఅంటూనే ఒకవేళ బీజేపీ లోకి వెళ్తే చంద్రబాబుకు చెప్పే వెళ్తానని స్పష్టం చేసారు. అసలు నారా చంద్రబాబు నాయుడు ఏపీలో ఉనికి లేని పార్టీకి దగ్గరవ్వటం, అదే సమయంలో రాష్ట్రంలో మరో ఉనికి లేని పార్టీతో యుద్దం చేయటం తోనే టీడీపీ ఖర్మకాలి ఈ దుర్గతి పట్టిందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును కొంత మంది (బహుశ ఆయన కోటరీ పంచ పాండవులు కావచ్చు!) తప్పుదారి పట్టించారని, వ్యక్తుల కంటే మిషన్లను బాగా నమ్మారంటూ చెప్పుకొచ్చారు.
సుజనా చౌదరి దారి వెతుక్కుంటున్నట్లే ఉంది అయితే ఆయన రూటెటు? టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ సలహాదారు టిడిపి ముఖ్యుడు ఒక టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన, టీడీపీ వీడి బీజేపీలోకి వెళ్తున్నారనే వార్తలపైన ఎక్కడా ఆయన ఖండించక పోగా వెళ్లే పరిస్థితి వస్తే చంద్రబాబుకు చెప్పే వెళ్తానని స్పష్టం చేసారు.
గత అయిదేళ్లలో ఆశించిన స్థాయిలో పాలన జరగలేదనే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేల మీద రకరకాల ఆరోపణలు వచ్చినా, చంద్రబాబు వారికే తిరిగి పోటీకి దించటం సైతం నష్టం చేసిందని చెప్పారు. తనను నమ్మిన వ్యక్తుల కంటే, అధికారులు-ఐవీఆర్యస్ సర్వేలు, ఎలక్ట్రానిక్ మిషన్లు చెప్పిన వాటిని ఆయన ఎక్కువగా నమ్మారని పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.
చంద్రబాబును కొందరు తప్పు దోవ పట్టించారని కీలక వ్యాఖ్య చేసారు. ఇవిఎంలలో తప్పు జరిగే అవకాశం లేదన్నారు. జగన్ తన తెలివి తేటల తోనే వ్యాపారాల్లో సంపాదించారంటూ, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన పై కేసుల గురించి పదేపదే ప్రస్తావించి రాజకీయాలు చేయటం సరైన పద్దతి కాదనే అభిప్రాయం తాను అప్పుడే వ్యక్తం చేసానన్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కేంద్రంతో వ్యవహరిస్తున్న తీరును సుజనా చౌదరి సమర్దించారు. ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల వ్యాఖ్యలు చేసారు. ఆయన ఆలోచన తీరును సమర్ధించారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ, పవన్ కళ్యాన్ కారణంగానే టిడిపి విజయం సులువైనదని చెప్పుకొచ్చారు. నాడు పవన్ కళ్యాన్ సైతం హుందాగా వ్యవహరించారని చెప్పారు. తాము ప్రభుత్వంలో, రాజకీయ నిర్ణయాల్లో లోపాలపై అనేక సార్లు అధినేత దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
తాము కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చే సమయంలో కొన్నిసూచనలు చేసిన విషయాన్ని బయట పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి బయటకువద్దామని, అయితే ఎన్డీఏలో మాత్రం కొనసాగుదామని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. ఇక, ఏపీలో ఏ మాత్రం ఉనికి లేని కాంగ్రెస్కు — ఏ పార్టీ వ్యతిరేఖ పునాదులపై టిడిపి ఉనికి లోకి వచ్చిందో దానికి దగ్గరవటం, ఏ మాత్రం ఉనికి లేని బీజేపీతో యుద్దం చేయటం వలననే ఎన్నికల్లో టీడీపీకి ఈ గతి పట్టిందన్నారు.
తాజా ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంటే ఖాయంగా గెలిచేవాళ్లమని సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రత్యేక హోదా విషయంలో వ్యవహరించిన తీరు సైతం ఓటమికి ఒక కారణంగా పేర్కొన్నారు. లోకేశ్ - బీసీ సీటు అయిన మంగళగిరి — నుండి పోటీ చేయటం ఎట్టిపరిస్థితుల్లో సరైన విషయం కాదన్నారు. ఏపీలో బీజేపీని దెబ్బ కొట్టామని, అలాగే టిడిపి కూడా నిండా మునిగిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక, విమానాశ్రయంలో చంద్రబాబు తనిఖీలను ఇష్యూ చేయటం మంచిది కాద న్నారు. ఈ వ్యాఖ్య లతో సుజనా చౌదరి టీడీపీకి తిలోదకలిచ్చి బీజేపీలోకి వెళ్లటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.