ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పుడున్న పార్టీ నుంచి బరిలోకి దిగితే ప్రజలు ఆదరిస్తారా..? లేదా..? ఇతర పార్టీల్లోకి వెళ్తే గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..? ఇలా సవాలక్ష ప్రశ్నలతో తకిబికి అవుతున్నారు. ఇక మరికొందరు నేతలు తమ రాజకీయవారసులుగా తనయులను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. వాళ్లు కూడా పై ప్రశ్నలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే, ఇందులో భాగంగానే బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి కుమారుడు దగ్గుపాటి హితేష్ చెంచురామ్ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు వారున్న పార్టీ బీజేపీ నుంచి మాత్రం కాదండోయ్.. వైసీపీలోకి వెళ్లి.. పోటీ చేయించాలనే ఆలోచనలో చిన్నమ్మ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో హితేశ్ను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు చిన్నమ్మ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడి నుంచే ఎందుకంటే.. పర్చూరు నియోజకవర్గ ప్రజలతో దగ్గుబాటి కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఒకప్పుడు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. 1989లో ఆయన టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆ తర్వాత 2004 - 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్య రాజకీయాల్లో ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
విభజన కారణంగా పలువురు కీలక కాంగ్రెస్ నేతలంతా ఎన్నికలకు దూరమైనట్లే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా గెలుపుపై అనుమానంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఆ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఏలూరి సాంబశివరావు అక్కడి నుంచి విజయం సాధించారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ తమను మోసం చేసిందనే భావన ఆంధ్రుల్లో బలంగా నాటుకుంది. బీజేపీపై అన్నివర్గాల ప్రజలు కొంత గుర్రుగానే ఉన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన మాట తప్పారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఏపీలో వైసీపీ కొంత బలం పుంజుకుంటుందనే ఆలోచనలో చిన్నమ్మ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగితే గెలవడం కష్టమని అంచనా వేస్తున్న చిన్న హితేశ్ను వైసీపీ నుంచి పర్చూరులో బరిలోకి దించేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా.. విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తే.. తాను కూడా వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.