కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన చేతకాని తననాన్ని బయటపెట్టుకున్నారు. ప్రజలు నిజాయితీగా పన్నులు కట్టకపోవటం వల్లే ప్రభుత్వం చమురుపై భారీగా పన్నులు వేస్తోందంటూ పనికిమాలిన వాదన వినిపించటం విచిత్రంగా ఉంది. పెట్రో ఉత్పత్తులపై పన్నుల ఆదాయం నికరంగా వస్తుంది కాబట్టి కేంద్రం కూడా గట్టిగా ఉందట. ప్రజలంతా పన్నులు కట్టడం మొదలుపెడితే కేంద్రం కూడా చమురు ఆదాయంపై ఆధారపడటం తగ్గించి పన్నులు తగ్గిస్తుందట. ఇంధన ధరలను తగ్గిస్తే భారత అప్పుల ఊబిలో కూరుకుపోతుందని కూడా జైట్లీ ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.
వేతనజీవులే దొరికిపోయేది
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మధ్య తరగతి జనాలు, ఉద్యోగుల నుండి ప్రభుత్వం ఎటూ ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తూనే ఉంది. కాబట్టి పన్నులు రావాల్సింది వ్యాపార వర్గాల నుండే. అందులోనూ భారీ పారిశ్రామిక వేత్తలు చెల్లించాల్సిన పన్నులైతే వందలు, వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని సమాచారం. దేశంలోనే ప్రఖ్యాతి చెందిన పారిశ్రామిక వేత్తలు చెల్లించాల్సిన పన్ను బకాయిల గురించి మాత్రం కేంద్రప్రభుత్వం మాట్లాడటం లేదు.
పారిశ్రామిక వేత్తలందరూ పన్నులు కడుతున్నారా ?
పన్ను చెల్లింపు దారులందరినీ నూరు శాతం పన్నుల చెల్లింపు పరిధిలోకి తెస్తామని కేంద్రం చెబుతున్నవన్నీ ఉత్త మాటలుగానే మిగిలిపోతుందన్న విషయం అర్ధమైపోతోంది. ఎందుకంటే, బడా పారిశ్రామికవేత్తల నుండి నికచ్చిగా పన్నులు వసూలు చేయగలిగితే కేంద్రానికి ఆదాయాలు అవే పెరుగుతాయి. ఆదాయపన్ను కట్టని బడా పారిశ్రామికవేత్తల జాబితాను ఎప్పటికప్పుడు జనాల ముందుంచితే కొంతైనా పన్నులు వసూళ్ళు అయ్యే అవకాశం ఉందని కేంద్రానికి తెలీదా ? దాంతో చమురుపై పన్నులు తగ్గించవచ్చన్న విషయం జైట్లీకి తెలీదా ? పన్ను వసూళ్ళల్లో ఏనుగుల్లాంటి బడా పారిశ్రామిక వేత్తలను పట్టుకోకుండా చిట్టెలుకాల్లాంటి వేతన జీవులను కేంద్రప్రభుత్వం బాదటంలో అర్దం లేదు.