కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేయటంతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో సంతోషం పట్టలేకున్నారా ? యడ్యూరప్ప రాజీనామా చేయగానే చంద్రబాబు మాటలే ఆయనలోని సంతోషాన్ని బయటపెడుతున్నాయి. కర్నాటకలో యడ్యూరప్ప రాజీనామా చేస్తే ఏపిలో చంద్రబాబుకు ఎందుకంత సంతోషం ? అంటే అందుకు కారణాలున్నాయి. కేంద్రమంత్రివర్గం నుండి తర్వాత ఎన్డీఏ లో నుండి టిడిపి బయటకు వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నాలుగేళ్ళు బిజెపితో అంటకాగిన చంద్రబాబు ఏపి ప్రయోజనాలు, ప్రత్యేకహోదా అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.
అదే సమయంలో కర్నాటకలో సాధారణ ఎన్నికలు వచ్చాయి. దాంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. మోడిపై తనకున్న కసిని తీర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చినట్లుగా ఫీలయ్యారు. వెంటనే కర్నాటకలో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయమంటూ తన పార్టీ వారికి పురమాయించారు. అందులో భాగంగానే పలువురు మంత్రులు కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో బిజెపికి వ్యతిరేకంగాను, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కు అనుకూలంగాను బాహాటంగానే ప్రచారం చేశారు. సరే, టిడిపి ప్రచారాన్ని ఎంతమంది పట్టించుకున్నారు అన్న విషయం వేరే సంగతి. కర్నాటక మొత్తం మీద సుమారు 80 లక్షల మంది తెలుగు వాళ్ళున్నారు. అందుకనే బిజెపి ఓటమికి టిడిపి అంత పట్టుదలగా ప్రయత్నించింది.
అనుకున్నదొకటి..అయ్యిందొక్కటి
బిజెపి ఓటమికి టిడిపి శతవిధాల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎందుకంటే, 104 స్ధానాలు గెలుచుకున్న బిజెపి అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. అందుకని గవర్నర్ బిజెపినే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. దాంతో చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నేతలకు ఒళ్ళు మండిపోయింది. అయినా ఏం చేయలేక తమలో తాము కుమిలిపోయారు. బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వటంతో టిడిపికి కారం రాపినట్లైంది.
కోర్టు జోక్యంతో ఉత్సాహం
ఎప్పుడైతే గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రింకోర్టు యాక్టివ్ అయ్యిందో అప్పటి నుండి టిడిపిలో ఉత్సాహం మొదలైంది. పైగా బలనిరూపణకు బిజెపికి తగిన సమయం కూడా సుప్రింకోర్టు ఇవ్వలేదు. పైగా 24 గంటల్లోనే బలనిరూపణ చేయాలంటూ ఆదేశించటంతోనే బిజెపి ఓటమి దాదాపు ఖాయమైపోయింది. చివరకు అందరూ ఊహించినట్లే యడ్యూరప్ప బలనిరూపణలో విఫలమై రాజీనామా చేశారు.
చంద్రబాబులో సంతోషం
యడ్యూరప్ప రాజీనామాపై చంద్రబాబు మాట్లాడుతూ, కర్నాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. నరేంద్రమోడి, అమిత్ షా ఎత్తులు పారలేదన్నారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయంగా చంద్రబాబు వర్ణించారు. యడ్డీ రాజీనామాతో అందరూ సంతోషంగా ఉందా అంటూ పాధికారమిత్రలను అడిగటం గమనార్హం. పనిలో పనిగా ఏపికి అన్యాయం చేసిన వారిని మట్టికరిపించాలంటూ పిలుపివ్వటం గమనార్హం. అంటే చంద్రబాబు మాటల్లోనే బిజెపి ఓడినందుకు ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పకనే తెలిసిపోతోంది.