జేడీ లక్ష్మినారాయణ ఏం చేయబోతున్నారు..?
ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారా..? 2019 లో అధికారమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారా? రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్త పార్టీ అడుగు పెట్టబోతోందా? అసలు జేడీ రాజీనామా చేయడం వెనుక ఉద్దేశమేమిటి? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు?
రోజురోజుకీ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. కొన్నేళ్లుగా రాజకీయాల్లో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే ఉన్నప్పటికీ సీన్ ఇప్పుడు మరోలా కూడా కనిపిస్తోంది. ఏపీలో పాగా వెయ్యడానికి కమల దళం ఉవ్విళ్లూరుతోంది. పవన్ కళ్యాణ్ కూడా తనకంటూ ఒక మార్క్ నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ను బేస్ చేసుకొని ఏపీ రాజకీయాల దిశ మార్చడానికి బీజేపీ తెర వెనుక రాజకీయాలు జోరుగా సాగిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తెర వెనుక రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబును వదిలించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీతో తెర వెనుక సంబంధాలు కొనసాగిస్తోన్న కమలం పార్టీ జన సేనానికి కూడా దగ్గరయ్యేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జేడీ లక్ష్మీ నారాయణను రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో జేడీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు ఉండరు. జగన్, గాలి జనార్ధన్ రెడ్డి కేసుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరును అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హస్తినలో సత్తా చూపిన ఆమ్ ఆద్మీ పార్టీ జేడీని సారథిగా ఉపయోగించుకుని ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జన సేనతో పొత్తు పెట్టుకొని 2019 ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తన రాజీనామాతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ ఉహాగానాలకు జేడీ లక్ష్మీనారాయణ తెర తీశారు. నిజాయతీ అధికారిగా ప్రజల మన్నన పొందిన ఆయన రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికే ఉద్యోగానికి రాజీనామా చేశారని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఏ పార్టీలో చేరతాడనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.