అమరావతి : చంద్రబాబు చేతనవుతుందా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటి ఎస్సీ నియోజవకర్గాలను గెలుచుకోవాలన్నది చంద్రబాబునాయుడు టార్గెట్. అయితే గడచిన రెండుఎన్నికలుగా సాధ్యంకావటంలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఒక్కటంటే ఒకే ఒక నియోజకవర్గం దక్కింది. రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉన్నాయి. ఇందులో ప్రకాశంజిల్లాలోని కొండెపిలో మాత్రమే టీడీపీ గెలిచింది. మిగిలిన 28 నియోజకవర్గాల్లో వైసీపీ 27 చోట్ల గెలిచింది. రాజోలు నియోజకవర్గంలో జనసేన తరపున పోటీచేసి రాపాక వరప్రసాద్ గెలిచారు.



గెలిచిన తర్వాత పార్టీ అధినేత పవన్ కల్యాన్ తో విభేదాల కారణంగా రాపాక కూడా వైసీపీ మద్దతుదారుడిగానే కంటిన్యు అవుతున్నారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా మెజారిటి సీట్లు వైసీపీనే గెలిచింది. అందుకనే 2024 ఎన్నికల్లో వైసీపీ హవాకు బ్రేకులు వేసి ఎస్సీ సీట్లలో గెలవటం ఎలాగన్నది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపధ్యంలోనే టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి వివిధ రాజకీయపార్టీలు, ఎస్సీ ప్రజాసంఘాలు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు.



ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది వర్లరామయ్య. సరే మామూలుగానే తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డిపైన వర్ల విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అనేకమంది ఎస్సీలను పొట్టనపెట్టుకుందట. ఎక్కడో ఆకాశంలో ఉన్న జగన్ను ఎస్సీలంతా కలిసి వచ్చేఎన్నికల్లో భూమిపైకి తేవాలన్నారు. దళితుల పోరాటం ఎలాగుంటుందో జగన్ కు చూపించాలన్నారు. ఇక నక్కా ఆనందబాబు లాంటి వాళ్ళు కూడా చాలానే మాట్లాడారు.



వీళ్ళమాటలు సరే అసలు ఎస్సీలంతా మూకుమ్మడిగా జగన్ కు ఎందుకు మద్దతుగా నిలబడుతున్నారన్న విషయాన్ని చంద్రబాబు కానీ వర్ల కానీ ఎప్పుడైనా ఆలోచించారా ? మొదటినుండి మెజారిటి ఎస్సీలు  కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉన్నారు. జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ లో నుండి వచ్చేసి వైసీపీ ప్రారంభించారో వెంటనే ఎస్సీ ఓటుబ్యాంకు కూడా జగన్ కు షిఫ్టయిపోయింది. జగన్ కూడా ఎస్సీలకు అధిక ప్రాధాన్యతిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ హయాంలో కన్నా ఇపుడు జగన్ కు మరింత ఎక్కువ మద్దతుదారులుగా మారిపోయారు. అందుకనే 98 శాతం సీట్లు వైసీపీకే దక్కాయి. మరిదీన్ని బ్రేక్ చేయటం చంద్రబాబుకు సాధ్యమవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: