అమరావతి : ఇక్కడ వైసీపీ కొంపముణిగేట్లే ఉందిగా ?

Vijaya


వైసీపీలోని కొన్నినియోజకవర్గాల్లో అంతఃకలహాలు పెరిగిపోతున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో మైలవరం ముందువరసలో ఉంటుంది. మంత్రి జోగిరమేష్ కు ఎంఎల్ఏ వసంత కష్ణప్రసాద్ కు ఏమాత్రం పడటంలేదు. మంత్రి నియోజకవర్గమేమో పెడన, ఎంఎల్ఏదేమో మైలవరం. జోగిది మైలవరమే కానీ కారణాలంతరాల వల్ల పెడనకు షిఫ్ట్ అయ్యారు. ఇంతకుముందు గెలిచింది మొన్నటి ఎన్నికల్లో గెలిచింది కూడా పెడనలోనే. మొదటినుండి మైలవరంలో ఎక్కువగా కమ్మ అభ్యర్ధులే గెలుస్తున్న కారణంగా బీసీ నేతైన జోగిని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే పెడనకు పంపారు.



ఎప్పుడైతే మైలవరంలో వసంత గెలిచారో అప్పటినుండి జోగికి మళ్ళీ తన నియోజకవర్గానికి వచ్చేయాలని కోరిక పెరిగిపోతోంది. అందుకనే ఎంఎల్ఏని కంపుచేస్తున్నారు. జగన్ దగ్గర పంచాయితి జరిగినా పరిస్ధితిలో మార్పొచ్చినట్లు లేదు. ఈ నేపధ్యంలోనే ఎంఎల్ఏ పరోక్షంగా మంత్రి మద్దతుదారులపై రెచ్చిపోయారు. పార్టీలో చెడ్డీగ్యాంగ్, తొట్టిగ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, అల్లరి మూకలు పెరిగిపోయినట్లు చెప్పారు. స్వపక్షంలోనే విపక్షం తయారైందని రెచ్చిపోయారు.



పార్టీని కంపుచేస్తున్న కోతిమూకల నుండి అందరు జాగ్రత్తగా ఉండాలని వసంత చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయిపోయింది. ఎంఎల్ఏ చేసిన వ్యాఖ్యలన్నీ మంత్రి జోగి మద్దతుదారులను ఉద్దేశించి చేసినవే అనే చర్చ పెరిగిపోతోంది. ఈమధ్యనే జోగి-వసంత మధ్య స్వయంగా జగనే పంచాయితి చేశారు. ఒక నాలుగురోజులు ప్రశాంతంగా ఉన్నట్లే ఉండి రెండువర్గాల మధ్య గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. ఇద్దరు కొట్టుకుని చివరకు పెడన, మైలవరంలో పార్టీని ముంచేట్లే ఉన్నారు.



తాజాగా వసంత చేసిన వ్యాఖ్యలు బాగా తీవ్రంగానే ఉన్నాయి. రెగ్యులర్ గా  క్రైమ్ వార్తలు ఫాలో అయ్యేవాళ్ళకి బ్లేడు బ్యాచ్, చెడ్డీ గ్యాంగ్ గురించి బాగా తెలుసు. ఆ గ్యాంగులంటే జనాల్లో హడల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి గ్యాంగులతో మంత్రి మద్దతుదారులను ఎంఎల్ఏ పోల్చటమంటే కాస్త ఎబ్బెట్టుగానే ఉంది. అధికారపార్టీ వాళ్ళని  ప్రతిపక్షాలు ఈ పోలికితో ఆరోపణలు, విమర్శలు చేశాయంటే అర్ధముంది. కానీ వైసీపీలోని నేతలే ఒకళ్ళ మద్దతుదారులపై మరొకళ్ళు ఇలాంటి ఆరోపణలు చేయటమంటే వ్యవహారం చాలా తీవ్రంగా ఉందని అర్ధమైపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: