అమరావతి : తమ్ముళ్ళ దుమ్ము దులిపేసిన చంద్రబాబు

Vijaya



గన్నవరంలో పార్టీ ఆఫీసుపై దాడి, సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యవహారం, కోర్టులో హాజరవ్వటం లాంటి ఘటనలపై చంద్రబాబునాయుడు బాగా సీరియస్ అయ్యారని సమాచారం. కష్టాల్లో ఉన్న పట్టాభికి పార్టీలోని నేతల్లో ఒక్కళ్ళు కూడా అండగా నిలబడకపోవటంపై తీవ్రంగా మండిపోయారట. టెలికాన్ఫరెన్సులోకి అందరినీ లైనులోకి తీసుకుని నేతల ఫెయిల్యూర్ పై దుమ్ము దులిపేశారట. గన్నవరం పార్టీ ఆఫీసు విషయంలో అంత గొడవ జరుగుతున్నా స్ధానిక నేతలు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని నేతలంతా ఏమైపోయారంటు నిలదీశారట.



విజయవాడలోని పట్టాభి ఇంటికి నేతల్లో ఎవరూ ఎందుకు వెళ్ళలేదని నిలదీశారట. పట్టాభి భార్య, పిల్లలను పరామర్శించాల్సిన బాధ్యతను నేతలంతా మరచిపోయారా అంటు ప్రశ్నించారట. మంగళవారం మధ్యాహ్నం వరకు పట్టాభి ఇంటికి నేతల్లో ఒక్కరు కూడా వెళ్ళలేదని తెలియటంతో వెంటనే హైదరాబాద్ నుండే చంద్రబాబే విజయవాడకు  చేరుకున్నారు.  పార్టీ అధినేత పట్టాభి ఇంటికి చేరుకున్నారని తెలిసిన తర్వాత మాత్రమే నేతలు ఒక్కొక్కళ్ళు పట్టాభి కుటుంబాన్ని పరామర్శించటం మొదలుపెట్టారు.



పార్టీ ఆఫీసుపై వైసీపీ మూకలు దాడులు చేసినా, ఒక నేత ఇంటిపై దాడి జరిగినా సదరు నేతకు అండగా నిలవాలని తాను గుర్తుచేయాలా ? అని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతి చిన్న విషయాన్ని తానే దగ్గరుండి గుర్తుచేయాలంటే సాధ్యంకాదన్నారు. పార్టీ తరపున మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలుగా పనిచేసిన నేతల్లో ఒక్కరు కూడా పట్టాభి ఇంటికి వెళ్ళలేదని బాగా మండిపోయారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ తదితరులకు ఫుల్లుగా క్లాసు పీకారు.



పార్టీ నేతల వైఖరిపై తొందరలోనే ప్రత్యేకంగా సమీక్షిస్తానని చెప్పారు. అయితే ఆ సమీక్ష ఎప్పుడుంటుందో మాత్రం చెప్పలేదు. చంద్రబాబుకు నేతలు సమాధానమిస్తు తమ ఇళ్ళ దగ్గర పోలీసులు కాపలాగ ఉండటం వల్లే ఇళ్ళల్లోనుండి బయటకు రాలేకపోయినట్లు సంజాయిషీ చెప్పుకున్నారు. తమను పోలీసులు ముందుజాగ్రత్తగా హౌస్ అరెస్టులు చేసిన కారణంగానే తాము గన్నవరం లేదా పట్టాభి ఇంటికి వెళ్ళలేకపోయినట్లు చెప్పుకున్నారు. అయితే దీన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. ఊరికే సాకులు చెప్పి బాధ్యతల నుండి తప్పించుకుంటున్నట్లు మరింతగా మండిపోయారు. మరి గన్నవరం ఘటనపై చంద్రబాబు ఎప్పుడు సమీక్ష పెడతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: