గోదావరి : ఈ సామాజికవర్గాలతో తలనొప్పి తప్పదా ?

Vijaya






ఎన్నికల్లో అన్నీ సామాజికవర్గాలు, అన్నీ వయసులవాళ్ళు ఓట్లేస్తేనే ఏ పార్టీఅయినా అధాకరంలోకి వస్తుంది. పోయిన ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం ప్రాప్తించటానికి ఇదే కారణం. ఇదే సమయంలో టీడీపీ ఘోర పరాజయానికీ ఇదే కారణం. ఇక జనసేనకు కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుందన్నా, పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో పవన్ ఓడిపోయినా కూడా ఇదే కారణం. అందుకనే కొంతకాలంగా తాను అందరివాడినని, తనకు అందరు ఓట్లేసి గెలిపించాలని పవన్ పదే పదే కోరుతున్నారు.



సరే జనసేనకు ఎవరు ఓట్లేస్తారు, ఎవరు వేయరు అన్న విషయాలను పక్కనపెట్టేద్దాం. మిగిలిన సామాజికవర్గాలను పక్కనపెట్టేస్తే పవన్ మాత్రం రెండు సామాజికవర్గాలపైనే తన దృష్టంతా పెట్టుకున్నారు. అవేమిటంటే ఒకటి సొంత సామాజికవర్గం కాపులు రెండో సామాజికవర్గం క్షత్రియులు. కాపులు ఉభయగోదావరి జిల్లాల్లోనే కాకుండా బలిజల పేరుతో రాయలసీమలో కూడా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఇక కాపులతో పోల్చితే  జనాభా రీత్యా క్షత్రియులు మైనారిటీలనే చెప్పాలి.



క్షత్రియులు ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, విశాఖపట్న జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, కృష్ణాజిల్లాలోని కైకలూరులో  కేంద్రీకృతమయ్యున్నారు. గోదావరి జిల్లాల్లోని భీమవరం, నరసాపురం, ఉండి, కాకినాడ, ఏలూరు, రాజోలు, పిఠాపురం, దెందులూరు నియోజకవర్గాల్లో కీలకంగా ఉంటారు. ఇక్కడ సమస్య ఏమిటంటే కాపులకు క్షత్రియులకు చాలాచోట్ల పడదు. పవన్ అభిమానసంఘాలకు, ప్రభాస్ అభిమానసంఘాలకు గతంలో చాలా పెద్ద గొడవలే అయ్యాయి. పోయిన ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓటమికి క్షత్రియులు నూరుశాతం వ్యతిరేకించటం కూడా కీలకమే.




ఇలాంటి రెండు సామాజికవర్గాలను పవన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారో అర్ధం కావటంలేదు. పనిలో పనిగా కాపులంటే బద్ధవిరోధంగా ఉండే మరో సామాజికవర్గం బీసీలు ముఖ్యంగా శెట్టిబలిజలు. అంటే కాపులకు పై రెండు సామాజికవర్గాలతో పడదన్న విషయం అందరికీ తెలుసు. మరీ స్వయంగా కాపు అయిన పవన్ బీసీలను, క్షత్రియులతో తలనొప్పులు తప్పేట్లులేదు. పైగా నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును పవన్ వెనకేసుకొస్తుండటం కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: