"ఈనాడు"లో వచ్చిన ఆ కథనంపై వైసీపీ మంత్రి ఫుల్ ఫైర్?
విద్యాశాఖ మంత్రిగా మారాక ఆయన పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ కథనంతో
విద్యాశాఖ మంత్రి బొత్స మీడియా ముందుకు వచ్చారు. ఈనాడులో వచ్చిన గురువులకే పరీక్ష కథనంపై మండిపడ్డారు. ఈనాడులో ద్వంద్వ ప్రమాణాలతో ఆ స్టోరీ రాశారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రమణాలు పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని.. ఎక్కడా నూటికి నూరు శాతం ఫలితాలు రావాలని టార్గెట్ పెట్టలేదని వివరణ ఇచ్చారు. ఈనాడు స్టోరీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.
కొందరు టీడీపీ నాయకులు నన్ను రాజీనామా చేయమనడం చూస్తే నవ్వొస్తుందన్నారు. తనకు మంత్రి పదవి కొత్త కాదని... మంత్రిగా 13 ఏళ్ల అనుభవం అందని.. అంతకు ముందు 5 ఏళ్లు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించానని.. ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసని కామెంట్ చేశారు. తప్పుడు పనులు చేసే వారికి అన్నీ తప్పులే కనిపిస్తాయని... మేము తప్పులను ఉపేక్షించబోమమని.. విద్యార్థుల భవిష్యత్తే సీఎంగారికి, మా ప్రభుత్వానికి ప్రాధాన్యమని మంత్రి బొత్స అన్నారు.
మాస్ కాపీయింగ్ చేసైనా, నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని ఈనాడు చెబుతోందా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని ఎక్కడైనా చెప్పామా? అసలు ఆ పత్రిక ఈ సమాజానికి ఏం చెప్పబోతుంది అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన 5 పరీక్షల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదన్నారు మంత్రి బొత్స. ఎక్కడా పరీక్షకు ముందు పేపర్లు లీక్ కాలేదన్నారు. పరీక్షలు మొదలైన తర్వాత మాత్రమే కొందరు ప్రలోభాలకు లొంగి పేపర్లు ఫోటో తీశారని.. వారిపై చర్యలు తీసుకున్నామని మంత్రి బొత్స వివరించారు.