మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గవర్నర్ ?
గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి అలాగే గవర్నర్ తమిళిసై మధ్య చిచ్చు చెలరేగిన సంగతి అందరికి తెలిసింది. దీనికి కారణం లేకపోలేదు గవర్నర్ ఈ మధ్య వరుసగా ఒకటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవటమే. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన సామినేని సాయి గణేశ్, అలాగే కామారెడ్డి జిల్లాలో జరిగిన తల్లీ కుమారుల ఆత్మహత్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఈ రెండు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం కూడా సృష్టించాయి. అయితే ఇటీవల గవర్నర్ తమిళిసైను కలిసిన బీజేపీ నేతలు జరిగిన ఈ రెండు ఘటనల మీద వచ్చిన కథనాలను అలిగే మీడియా, సోషల్ మీడియాలలోని వార్తను సమర్పించి దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమెకి వినతిపత్రం ఇచ్చారు.
ఇక ఈ విషయం పైన స్పందించిన గవర్నర్ ఈ రెండు ఘటనలపై తగిన సమగ్ర నివేదిక సమర్పించాలి అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతే కాదు, రాష్ట్రం లోని ప్రైవేటు వైద్య కళాశాలలకు సంబంధించిన పీజీ సీట్లను బ్లాక్ చేసి వాటిని అడ్డదారిలో విక్రయిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై కూడా గవర్నర్ తమిళిసై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపైన కూడా నివేదిక ఇవ్వాలని కాలేజ్ ఆరోగ్య విశ్వ విద్యాలయ ఉపకులపతిని కూడా ఆదేశించారు. మరి ఇంకా ముందు ముందు కేసీఆర్ కు గవర్నర్ కు మధ్యన ఏమి జరగనుందో చూడాలి.