అమరావతి : టీడీపీలో బీసీ టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya



జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్-2 తర్వాత తెలుగుదేశంపార్టీలో టెన్షన్ మొదలైపోయింది. తాజాగా జరిగిన పునర్ వ్యవస్ధీకరణలో బీసీలకు జగన్ పెద్దపీట వేయటాన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.  మొదటి క్యాబినెట్లో ఎనిమిది మంది బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తే తాజా మంత్రివర్గంలో పదిమంది బీసీలకు అవకాశం ఇచ్చారు. దీంతో సహజంగానే బీసీ సామాజికవర్గాల్లో ఇదే విషయమై చర్చ మొదలైంది.



దీంతో టీడీపీలో ఉలికిపాటు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బీసీల్లో వీలైనంతమందిని తనవైపు తిప్పుకోవటమే టార్గెట్ గా జగన్ పావులుకదుపుతున్నారు. జగన్ ఆలోచనలకు తగ్గట్లే బీసీలు గనుక వైసీపీ వైపు వెళిపోతే టీడీపీ పనిగోవిందానే. ఆ విషయం  బాగా తెలుసుకనుకే వెంటనే మొత్తం తమ్ముళ్ళంతా జగన్ పై ఆరోపణలు, విమర్శలతో దండయాత్ర మొదలుపెట్టారు. బీసీలకు మంత్రిపదవులు ఇవ్వటం కాదని వాళ్ళల్లో ఎవరికీ స్వేచ్చలేదని గోల మొదలుపెట్టారు. విచిత్రమేమిటంటే 151 మంది ఎంఎల్ఏల్లో 10 మంది బీసీలకు మంత్రిపదవులు ఇవ్వటం కూడా గొప్పేనా అనే పిచ్చి లాజిక్ మొదలుపెట్టింది. 25 మంత్రుల్లో ఎంతమంది బీసీలకు చోటిచ్చారో చెప్పమంటే మాత్రం తమ్ముళ్ళ నోళ్ళు పెగలటం లేదు. 



స్వేచ్చలేని, అధికారాలు లేని మంత్రిపదవులు ఇస్తే ఏమిటి ఇవ్వకపోతే ఏమిటంటు అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు గోల మొదలుపెట్టారు. పైగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం కార్యక్రమాలు అమలు చేయబోతున్నట్లు యనమల చెప్పటమే విచిత్రం. మరిదే పద్దతి ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు అమలు చేయలేదని అడగితే సమాధానం లేదు.



ఏదేమైనా టీడీపీ నేతల్లో కలవరం స్పష్టంగా కనబడుతోంది. పార్టీకి దూరమవుతున్న బీసీలను మళ్ళీ ఎలా దగ్గరకు తీసుకోవాలో అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో బీసీలకు ఎంతమందికి ప్రాధాన్యత ఇచ్చారు, ఇపుడు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని వైసీపీ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. దీనికి కౌంటరుగా ఏమి చెప్పాలో తమ్ముళ్ళకు అర్ధంకావటంలేదు. అందుకనే స్వేచ్చ, నిధులనే పిచ్చి లాజిక్ ను మొదలుపెట్టారు. హోలు మొత్తంమీద చూస్తుంటే టీడీపీలో బీసీల టెన్షన్ మొదలైనట్లే కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: