అమరావతి : ఇలాగైతే చంద్రబాబును ఎవరు నమ్ముతారు ?

Vijaya



చెప్పుకోవటానికే తనకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కానీ జనాల్లో బొత్తిగా నమ్మకం సంపాదించకోలేకపోయారు. జనాలు సంగతి వదిలేస్తే పార్టీలో చాలామంది నేతలు కూడా చంద్రబాబునాయుడును నమ్మరు. ఎందుకంటే అవసరానికి నోటికొచ్చిన హామీలిచ్చేయటం అవసరం తీరిపోగానే తెప్పతగలేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎప్పటి చరిత్రో అవసరం లేదు మొన్న 2014-19 మధ్య ఏమి జరిగిందో అందరు చూసిందే.



ఇపుడిదంతా ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో యువతకే 40 శాతం టికెట్లిస్తానని ప్రకటించారు. ప్రకటనయితే చేశారు కానీ ఇచ్చేంత వరకు నమ్మకమే లేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డంత ఘనంగా ఉందిమరి. 2019 ఎన్నికలకు ముందు అభ్యర్ధులపై సర్వేలు చేయించుకున్నట్లు చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చాలామందికి టికెట్లిచ్చేది లేదని సమీక్షల్లో చెప్పారు. కానీ చివరకు చాలామందికి టికెట్లిచ్చేశారు. అలాగే 100 టికెట్లు బీసీలకే కేటాయిస్తానని హామీ ఇచ్చారు.



అయితే ఎన్నికల సమయంలో ఆ హామీ ఏమైందో చంద్రబాబుకే తెలియాలి. 2014లో దాదాపు రు. 90 వేల కోట్ల రైతు రుణమాఫీ అన్నారు. రు. 10 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు. నిరుద్యోగ భృతన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానంటు హామీఇచ్చారు. ఈ హామీలన్నింటినీ చంద్రబాబు ఎంత చక్కగా అమలు చేశారో అందరూ చూసిందే. ఇలాంటి హామీలను తుంగలో తొక్కేసిన ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయినా చంద్రబాబు తన పద్దతిని మార్చుకోలేదు.



అవసరానికి హామీలిచ్చి తర్వాత తెప్ప తగలేయటంలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరనే ఘనత సాధించారు. కాబట్టి తాజాగా యువతకు 40 శాతం టికెట్ల ప్రకటనను కూడా జనాలు అలాగే చూస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశ్యంలో యువతంటే కేవలం సీనియర్ల వారసులేనేమో. ఇప్పటి వారసుల్లో చాలామంది మొన్నటి ఐదేళ్ళు తండ్రులను అడ్డం పెట్టుకుని చక్రం తిప్పినవాళ్ళే. వాళ్ళకే మళ్ళీ టికెట్లిచ్చేసి యువతకు 40 శాతం టికెట్లిచ్చానని చెప్పుకుంటారా ? లేకపోతే కొత్త యువతను ప్రోత్సహిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: