కోరలు చాస్తున్న ఒమిక్రాన్..?
మరోపక్క భారత్లోనూ ఒమిక్రాన్ ఉధృతి పెరుగుతోంది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ భారీగా కొత్త కేసులు నమోదవుతుండగా మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 కేసులు వెలుగు చూశాయి. వీటిలో ముంబయిలోనే అత్యధికం ఉన్నాయి. అంతేకాదు ముంబయిలో కరోనా డెల్టా వేరియంట్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లోనే 2,500 కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వారం క్రితం రోజుకు 150 మించి కేసులు ఉండేవి కాదని ఈ సంఖ్య మళ్లీ 2 వేలు దాటడం నిజంగా ఆందోళనకరమేనని, ప్రజల్లో అత్యధికులు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతోనే ఇది మరోసారి ముప్పుగా మారిందని మహారాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లోను ఒమిక్రాన్ వ్యాప్తి కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే దీని ప్రభావం కనిపిస్తుండగా ఏపీలో సైతం బుధవారం ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే కొత్త వేరియంట్ ఉధృతిని చవిచూస్తున్నబ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రంగానే ఉన్నాఆస్పత్రుల్లో చేరాల్సిన స్థాయిలో ముప్పు ఉండకపోవచ్చని ప్రాథమికంగా తేలడం మాత్రం కాస్త ఊరటనిచ్చే అంశమే.