జగనన్న : స్వామిజీ భేటీ! ఆంతర్యం ఏంటో?
హైందవ ధర్మ ప్రచార కర్త త్రిదండి చిన జియర్ స్వామీజీతో పాటు టీవీ 9 మీడియా బాస్ మై హోమ్స్ రామేశ్వర్ కూడా ఇవాళ ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఎప్పటి నుంచో జగన్ పాటించే నమ్మకాలపైనా విశ్వాసాలపైనా అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన తిరుపతి వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వరని, ఇచ్చేందుకు ఇష్టపెట్టుకోరని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఓ స్వామీజీ పూర్తిగా వైష్ణవాంశను ఆరాధించే హైందవ మత పెద్ద ఇవాళ ఓ చర్చకు తావిచ్చారు. ఏపీ సీఎం కు కూడా ఆ చర్చలో వాటా ఉంది. ఎప్పటికప్పడు జగన్ మత విశ్వాసాలపై మాట్లాడేవారి నోళ్లు మూయించేలా ఆ చర్చ నడుస్తోంది. ప్రతిష్టాత్మక ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఇష్టపడే సీఎం జగన్ కు ఈ సారి అనూహ్య స్థాయిలో ఆతిథ్యం దక్కింది.
అదెలా అంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో త్రిదండి చినజియర్ స్వామి భేటీ అయ్యారు. నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఆత్మీయ వచనం అందించారు. ఆశీస్సులు ఇచ్చారు. స్వామి కి ఎదురేగి వెళ్లిన జగన్ ఆయనకు పాదాభివందనం చేశారు. తొలుత వైవీ సుబ్బారెడ్డి ఆయనకు ఆహ్వానం పలికారు. ఆయన కూడా స్వామికి పాదాభివందనం చేశారు. హైద్రాబాద్లో తమ ఆశ్రమంలో జరిగే సహస్రాబ్ది ఉత్సవాలకు రమ్మని ఆహ్వానించారు. ఇక ఇప్పటిదాకా వైసీపీకి రాజ గురువుగా ఉన్న స్వరూసానందేంద్రతో పాటు జగన్ ను ఆత్మీయంగానూ ఆధ్యాత్మికంగానూ దగ్గర అయ్యేందుకు మరో స్వామిజీ ప్రయత్నిస్తుండడం విశేషం. స్వామీజీతో పాటు సీఎంను కలిసిన వారిలో మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు ఉన్నారు. ఈ సందర్భంగా స్వామీతో భేటీ అయిన సందర్భంగా ఆధ్యాత్మికానికి సంబంధించి పలు విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. తిరుపతి కేంద్రంగా చేపట్టే ఆగమ సంబంధ విషయాలపై స్వామీజీ సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా సమాచారం.