కృష్ణా టీడీపీలో ఆ సీటు పంచాయితీ తేల్చేది ఎప్పుడు?
మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్, పామర్రులో వర్ల కుమార్ రాజా, గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, గన్నవరంలో బచ్చుల అర్జునుడు, పెనమలూరులో బోడే ప్రసాద్, కైకలూరులో జయమంగళ వెంకటరమణ, నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, తిరువూరులో శావల దేవదత్, నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య, మైలవరంలో దేవినేని ఉమా, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్లో బోండా ఉమాలు పార్టీని నడిపిస్తున్నారు.
కానీ ఒక్క విజయవాడ వెస్ట్లోనే టీడీపీకి సరైన నాయకుడు లేరు...మామూలుగానే వెస్ట్లో టీడీపీ వీక్. ఏదో ఒకసారి మాత్రమే పార్టీ ఇక్కడ గెలిచింది. గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె షబానా పోటీ చేసి ఓడిపోయి, విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జలీల్ ఖాన్ కూడా యాక్టివ్ గా లేరు. కానీ ఈ సీటుని మాత్రం జలీల్ వదలడం లేదు...అదే సమయంలో ఈ సీటు కోసం బుద్దా వెంకన్న వర్గంలో ఉన్న నాగుల్ మీరా కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికల్లోనే సీటు దక్కించుకోవాలని చూశారు...కానీ కుదరలేదు. ఈ సారి మాత్రం వదులుకోకూడదని నాగుల్ మీరా చూస్తున్నారు. కేశినేని నాని వర్గంలో ఉన్న జలీల్ సైతం వదలడం లేదు. చంద్రబాబు కూడా ఈ ఒక్క సీటు పంచాయితీని తేల్చడం లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో గానీ పొత్తు ఉంటే..ఈ సీటు జనసేనకు కేటాయించాలని బాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది...అంటే రెండు గ్రూపులకు బాబు చెక్ పెట్టేసినట్లు అవుతుంది.