కేబినెట్ స్టార్ట్... గవర్నర్ వద్దకు జగన్ ఎందుకు...?
టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చర్చ. జరగనుంది. నిన్న వచ్చిన హైకోర్ట్ తీర్పు పై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. ప్రత్యేక అహ్వానితుల కోసం చట్ట సవరణ చేయనున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు పై చర్చ జరగనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు చేసే విషయమై చర్చించనున్నది కేబినెట్.
వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయమై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. విశాఖ శారదా పీఠం కు 15 ఎకరాలు భూములు కేటాయింపు పైన కేబినెట్ లో చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత సిఎం వైఎస్ జగన్ గవర్నర్ తో సమావేశం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 5 గంటలకు రాజ్భవన్ లో గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ తో భేటి కానున్న సీఎం జగన్... పలు కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. టీడీపీ కార్యాలయాలపై దాడులు, అంతకు ముందు టీడీపీ నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దానికి సంబంధించిన వీడియో ఆధారాలను గవర్నర్ కి సమర్పించే అవకాశం ఉంది అని అంటున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ నిర్వహించనున్నందున ఆ వివరాలను కూడా గవర్నర్ కు తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తుంది.