మళ్లీ సిలిండర్ మంట..? అందుకే కేంద్రం ఆగిందా..?
ఆ అంతరాన్ని పూడ్చాలంటే ధర పెంచక తప్పదని అంటున్నాయి. వారం లోపు ఈ పెంపు అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో సిలిండర్పై రూ.100 నుంచి 200 వరకు పెంచనున్నట్టు సమాచారం. ఇది అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతిపై ఆధారపడి ఉంటుందని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఇది ఇటీవలి కాలంలో ఐదవ పెంపు కానుంది. ఇప్పటికే అక్టోబర్ 6న అన్నీ క్యాటగిరిలలో ఒక్కో సిలిండర్ పై రూ.15 చొప్పున పెంచిన విషయం విధితమే. ఈ సంవత్సరం జులై నుంచి ఇప్పటిదాకా గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధర రూ.90 పెరిగినది. అసలు ధర, అమ్మకం ధర మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆయిల్, మార్కెటింగ్ కంపెనీలకు రాయితీలు ప్రకటించలేదు. పెరిగిన భారాన్ని భరిస్తామన్న హామీ కూడ ఇవ్వలేదు.
ఈ భారాన్ని వినియోగదారుల పైనే రుద్దాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు స్పష్ట అవుతోంది. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు గరిష్టస్థాయికి చేరుకున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌదీ ఎల్పీజీ రేటు ఈనెలలో ఏకంగా 60 శాతం పెరిగింది. 1 టన్ను గ్యాస్ అమాంతం 800డాలర్లకు ఎగబాకింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిత్యం పెంచుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ధరలను పెంచుతున్నాయని దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఈ తరుణంలోనే మరోసారి గ్యాస్ పెంచాలని చూస్తే ఎలా బతికేది అంటూ జనాలు ఆందోళనలో ఉన్నారు. గ్యాస్తో పాటు నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు బతుకు భారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.