బుద్దా-పట్టాభిలు చాలు బాబుకు.. పైకి లేపుతున్నారుగా...
అసలు కొందరు పదవుల కోసం అనుకుంటా మరీ టిడిపి అధినేత చంద్రబాబుకు భజన చేస్తారు. అలాగే సిఎం జగన్పై నిత్యం విమర్శలు చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగానే ఉంటుంది గానీ, పనికిరాని విమర్శలు చేసి సొంత పార్టీకే నష్టం జరిగేలా చేస్తారు. ఇటీవల డ్రగ్స్ అంశం ఏపీ రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడో గుజరాత్లో హెరాయిన్ కంటైనర్ పట్టుబడితే, దానికి కారణం జగనే అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఏదో అడ్రెస్ విజయవాడకు ఉందని వార్తలు రావడంతో టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. అసలు అది ఢిల్లీ మాఫియాకు చెందిన కంటైనర్ అని పోలీసుల వివరణ ఇచ్చినా సరే టిడిపిలో ఉన్న పట్టాభి లాంటి నాయకులు ఎక్కడా ఆగడం లేదు. అసలు జగనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని, డ్రగ్స్ వెనుక జగన్ ఉన్నారని, జగన్ డ్రగ్ డాన్ అంటూ ఆరోపిస్తున్నారు. ఈయనకు తోడుగా మరో టిడిపి నేత బుద్దా వెంకన్న సైతం...డ్రగ్స్ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వంతో లింక్ చేయడానికి చూస్తున్నారు.
రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని, అందుకే విజయసాయి సొంత పార్టీ నేతలకే అందుబాటులో లేకుండా పోయారని ఆరోపిస్తున్నారు. ఇసుక, మద్యం, భూ ఆక్రమణలతో సహ డ్రగ్స్ విషయంలో విజయసాయిరెడ్డే రాష్ట్ర బిగ్ బాస్కు సహకరిస్తున్నారని అంటున్నారు. అంటే గుడ్డిగా విమర్శలు చేయడంలో బుద్దా, పట్టాభిలు ముందున్నారు. ఏదేమైనా గానీ బట్ట కాల్చి ఎదుటవాళ్ళ మొహం మీద వేసేస్తున్నారు. దీని వాళ్ళ ఎదుటవారికి ఎంత నష్టం జరుగుతుందో గానీ, సొంత పార్టీకే ఎక్కువ నష్టం జరిగేలా ఉంది.