అఫ్గనిస్తాన్ యుద్ధం సమయంలో తాలిబన్లపై పోరాటానికి అఫ్గాన్ కమాండోలకు కఠిన శిక్షణ ఇచ్చింది అమెరికా సీఐఏ(సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ). ఈ కమాండోలు అమెరికాకు ఆయుధం లాంటి వారు. కానీ తాలిబన్లు అఫ్గన్ను స్వాధినం చేసకున్న తరువాత వీరిని వేటాడటం ప్రారంభించారు. అయితే 20వేల మంది అఫ్గాన్ కమాండోల్లో చాలా మంది అమెరికాకు తిరిగొచ్చినట్టు వెల్లడించారు అధికారులు. వీరంతా అమెరికాకు ఓ రహస్య ఆయుధం ఉంటారని చెప్పారు.
సీఐఏ శిక్షణనిచ్చి, తీర్చిదిద్దిన అఫ్గాన్ కమాండోల్లో 90శాతం మంది ఖతార్ మీదగా అగ్రరాజ్యానికి చేరుకున్నట్టు అధికారులు చెప్పారు. తాలిబన్ చెరలో ఉన్న అఫ్గాన్ గురించి వీరికి ఎన్నో విషయాలు తెలుసని, ఎన్నో కీలక సమాచారాలు వీరి వద్ద ఉందని చెప్పారు. వీరు తిరిగిరావడం అమెరికాకు సానుకూల అంశంగా ఉంటుందన్నారు. ఒకవేళ అఫ్గాన్పై అమెరికా మిలిటరీ ఆపరేషన్ చేపట్టాలంటే వీరి శక్తిసామర్థ్యాలు కీలకం అవుతాయని వివరించారు అధికారులు.
ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మోహరించే విధంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఈ దళాలు. పంజ్షేర్లో ఎన్ఆర్ఎఫ్ (నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్) తాలిబన్లతో పోరాటం చేస్తోంది. అవసరమైతే ఈ సూపర్ కమాండోలను అమెరికా అక్కడా మోహరించవచ్చు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ హయాంలో అప్గనిస్తాన్ ఆర్మీని ముందుండి నడిపించి, తాలిబన్లపై పోరాడింది ఈ సూపర్ కమాండోలే.
నేషనల్ డైరక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) పర్యవేక్షణలో పని చేస్తారు వీరు. కార్యకలాపాలు సాగించే ప్రాంతాల అనుగుణంగా ఎన్డీఎస్-01, ఎన్డీఎస్-02, ఎన్డీఎస్-03, ఎన్డీఎస్-04 విభాగాలు ఉంటూ.. ఏ విభాగానికి తగ్గట్టు అందుకు సంబంధించిన ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. తాలిబన్ల పై చివరి వరకు పోరాడిన కమాండోలు కేపీఎఫ్ అంటారు. ఖోస్ట్ రాష్ట్రంలో ఎన్డీఎస్ ఆధ్వర్యంలో ఈ కమాండోలు పని చేస్తాయి. చివరకు స్థానిక తాలిబన్లతో సంప్రదింపులు జరిపి అక్కడి నుంచి కాబుల్ ఏర్పోర్ట్కు వెళ్లారు. తరువాత అక్కడి నుంచి ఖతర్ మీదుగా అమెరికాకు తరలించారు.