వారం గడిచినా పూర్తిగా పడని జీతాలు, పెన్షన్లు!
రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రతినెలా రూ.500 కోట్లు అవసరమవుతాయి. ఇవి కాకుండా నెలలో ఒకటో తేదీ నాటికి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రతా పెన్షన్ల కింద రూ.1500 కోట్లు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లింపు కింద రూ.4,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఒకటో తేదీ నాటికి రూ.11,500 కోట్లు ఖజానాలో ఉండి తీరాల్సిందే. రుణాలకు వడ్డీల చెల్లింపుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు తమ వద్ద నుంచి ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా మినహాయించేస్తుంది. సెప్టెంబర్ లో జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు గతనెల 31న రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి రూ.వెయ్యి కోట్లు తీసుకువచ్చారు. తొలుత రాష్ట్ర సచివాలయం, ఆ తర్వాత శాఖాధిపతుల కార్యాలయాలు, అనంతరం జిల్లాలకు విడుదల చేస్తున్నారు. సెప్టెంబరులో పదో తేదీ నాటికి జీతాలు పెన్షన్లు పంపిణీ పూర్తవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు మాత్రం జీతాలు చెల్లింపులో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.