చంద్రబాబు లేకపోతే అచ్చెన్నాయుడు..!
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని సంకల్పించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండు మూడు నెలల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, సంస్థాగతంగా పటిష్టం కావడంపై చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడులు దృష్టి సారించారు. నిత్యం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు చెప్పిన అంశాలు, పార్టీ కార్యక్రమాలపై వారితో చర్చించనున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో అంత క్రీయాశీలకంగా లేని పార్టీ ఇన్ఛార్జిలను కూడా రాష్ట్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురిని పిలిచి పనితీరు మెరుగు పరచుకోకపోతే తప్పించాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించి పంపారని సమాచారం.
నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలపై కూడా పార్టీ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు వీటిని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, దానిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి గ్రామస్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇక చంద్రబాబు, అచ్చెంనాయుడు కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉండనున్నారు.