చాన్నాళ్ళకు బయటకు వచ్చిన యనమల... ఏమన్నారు మరి...?

Sahithya
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై విపక్షాలు కాస్త సీరియస్ గా ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేతలు ఈ మధ్య కాలంలో ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలనలో అభివృద్ధి జీరో అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోందన్న ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని తెలిపారు. రెండేళ్లలోనే 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో ఏ మూలనా అభివృద్ది లేదు.. సంక్షేమం లేదు అని విమర్శించారు.
2019-20 లో వైసీపీ ప్రభుత్వం 57 సార్లు ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్లారు అని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మూలధన వ్యయం కన్నా చెల్లిస్తున్న అప్పుల రీ-పేమెంటే ఎక్కువ అని విమర్శలు చేసారు. జగన్‌ తన రెండేళ్ల పాలనలో పారిశ్రామిక రంగంలో -5.2, సేవల రంగంలో -7.04, తలసరి ఆదాయంలో -6.6, జి.ఎస్‌.డి.పి లో -6.2 లు నమోదై నెగెటివ్‌ గ్రోత్‌ రేట్‌లతో రాష్ట్ర ఆర్ధిక వృద్ధిని భ్రష్టు పట్టించారు అని మండిపడ్డారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌, మే నెలల్లో రూ. 22,427.76 కోట్లు అప్పులు చేశారు అని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు.
2018-19 లో రూ.13899.07 కోట్ల రెవెన్యూ లోటు 2020-21 లో రూ. 35540.44 కోట్లకు చేరుకుంది అన్నారు. అన్ని రంగాల్లో జీరో అభివృద్ధి నమోదౌతోంది అని ఆయన తెలిపారు. రెండేళ్ల జగన్‌ పాలనలో నిరుద్యోగం 15 శాతంకు చేరింది అన్నారు ఆయన. నేరాలు-ఘోరాల్లో వంద శాతం వృద్ధి సాధించారు జగన్‌అని ఈ సందర్భంగా ఆరోపించారు. జగన్‌ రెడ్డి అనుభవ రాహిత్యంతో, అహంభావంతో, కక్షసాధింపు విధ్వంసక విధానాలతో, మితిమీరిన లూటీతో, దుబారాతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు అని మండిపడ్డారు. చాలా రోజుల తర్వాత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: