మిస్టరీ ఫ్లైట్.. కాన్సెప్ట్ అదరహో..!
అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు తొలగడంతో ఆయా దేశాలు విమాన ప్రయాణానికి అనుమతించాయి. కానీ, కరోనా కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీంతో విమానయాన రంగం ఉన్న ప్రయాణికులతో కొనసాగిస్తూ.. నష్టాలను చవిచూస్తోంది. అయితే ఈ మేరకు ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు విమానయాన రంగం టికెట్ల ధరలు తగ్గించడం, రాయితీలు ఇవ్వడం చేస్తున్నాయి. ఈ మేరకు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటస్ ఎయిర్లైన్ సంస్థ ఓ భిన్నమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. అదే మిస్టరీ ఫ్లైట్. ఈ కాన్సెప్ట్తో ప్రయాణికుల్లో విమానంపై ఆసక్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా విమానాల్లో ప్రయాణించాలంటే మనం ఎక్కడికి వెళ్తమో ఆ ప్రాంతం వరకే టికెట్లు తీసుకుంటాం. కానీ, మిస్టరీ ఫ్లైట్ దేశీయ విమాన సర్వీసులో ప్రయాణికులు వారి గమ్యస్థానం ఎంటో చెప్పనక్కర్లేదు. సిబ్బంది కూడా ఆ విమానం ఎక్కడికి వెళ్తుందో చెప్పదు. టికెట్ కొనుగోలు చేసి విమానం ఎక్కితే సరిపోతుంది. ఆ విమానం ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్లాలి. ఈ ప్రయాణం వ్యవధి కనీసం రెండు గంటలు ఉంటుంది. ఈ రెండు గంటల ప్రయాణం ముగిసిన తర్వాత ఏ ఎయిర్పోర్టు దగ్గరగా ఉంటే.. అక్కడే విమానాన్ని ల్యాండ్ చేస్తారు. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో సమీపంగా ఏదైనా చూడదగ్గ ప్రదేశాలు ఉంటే విమానాన్ని భూమికి తక్కువ ఎత్తులో తీసుకెళ్తారంట. అలా ప్రయాణికులు విమానంలో నుంచి మంచి ప్రదేశాలను చూడవచ్చు. ఈ ప్రయాణానికి సంబంధించి బుకింగ్స్ కొనసాగుతున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 18, మే 1వ తేదీల్లో ప్రయాణాలు ఉంటాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర ఆస్ట్రేలియన్ డాలర్లో రూ.737, ఎకానమి క్లాస్ టికెట్ ధర ఆస్ట్రేలియన్ డాలర్లో రూ.577గా ఉంది. ఈ సేవలు ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని క్వాంటన్ ఎయిర్లైన్స్ తెలిపింది.